కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అంతర్జాతీయ వినియోగం కోసం భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఆ దరఖాస్తు పరిశీలనకు WHO ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొవాగ్జిన్ ను భారత్ లో వినియోగిస్తుండగా.. ఇతర దేశాల్లో వినియోగించేందుకు WHO పర్మిషన్ తప్పనిసరి.
అయితే.. పలు దశల క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం లోపించిందని డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ నెల 23న కీలక సమావేశం జరగనుంది. కొవాగ్జిన్ కు సంబంధించిన 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి సమాచారాన్ని ఈ సమావేశంలో WHO కు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.
కొవాగ్జిన్ అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్ దాఖలు చేసిన దరఖాస్తును WHO నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఆ తర్వాత అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలా.. వద్దా అనేది నిర్ణయిస్తుంది.