
మంచిర్యాల, వెలుగు: శాంతిభద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురువారం ఆయన పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని డివిజిన్, జోన్లవారీగా పోలీస్ స్టేషన్లలోని పెండింగ్ కేసులు, నేరస్తుల అరెస్ట్, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్ షీట్ తదితర వివరాలను డీసీపీలు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తును స్పీడప్చేయాలని ఆదేశించారు. నిందితులకు కోర్టులో శిక్షలు పడేలా పకడ్బందీగా సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహిరంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, ప్రకాశ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, రవి కుమార్, శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీఐలు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.