గచ్చిబౌలి, వెలుగు: గుండె పోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి 2011 బ్యాచ్కు చెందిన అతని బ్యాచ్మెట్స్ చేయూతనిచ్చారు. 15 లక్షల విలువైన ఓపెన్ ప్లాట్ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి చేతుల మీదుగా గురువారం కానిస్టేబుల్ కుటుంబానికి అందజేశారు. సైబరాబాద్ కమిషనరేట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో 2011 సివిల్ బ్యాచ్కు చెందిన పర్మగల్ల యాదయ్య కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
2023 ఆగస్టు 8వ తేదిన గుండెపోటుతో మృతి చెందాడు. ఇతనికి భార్య పూజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాదయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, 2011 బ్యాచ్కు చెందిన సైబరాబాద్, రాచకొండ, కరీంనగర్లకు చెందిన బ్యాచ్మెట్లు అందరూ కలిసి రూ.15లక్షలు కలెక్ట్ చేశారు. వీటితో శంషాబాద్లోని పెద్ద షాపూర్ వద్ద యాదయ్య పిల్లల పేరుతో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.
ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ను గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్లో సీపీ అవినాష్ మహంతి చేతుల మీదుగా యాదయ్య కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వినీత్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేశ్, 2011 బ్యాచ్కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
