
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు సీపీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సైబరాబాద్లో 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 డివిజన్లు ఉన్నాయని.. 684 చోట్ల 2,569 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జరిగిందన్నారు. వీటిలో 770 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 3 వేల మంది అదనపు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. మొత్తం 13,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
179 రూట్ మొబైల్స్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్ట్రాంగ్ రూంలు, లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తును చేపట్టామన్నారు. 15 చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 22 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్ చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయడానికి ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తున్నామని సీపీ వెల్లడించారు.