ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
  • మాజీ ఎంపీ డా.మిడియం బాబూరావు

భద్రాచలం, వెలుగు: ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఇవ్వడం సరికాదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డా.మిడియం బాబూరావు అన్నారు. శుక్రవారం భద్రాచలంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దళితబంధు, డబుల్ బెడ్​రూం లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు సర్వాధికారాలు ఇవ్వ డంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ఒక రాజకీయ పార్టీకి చెందినవారికే పథకాలు పరిమితమయ్యే ప్రమాదం ఉందని, అసలైన అర్హులకు నష్టం జరుగుతుందన్నారు. పోడు భూముల విషయంలో అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్ రేంజర్​ హత్యను ఖండించారు. సమావేశంలో నియోజకవర్గ పార్టీ కన్వీనర్​ మచ్చా వెంకటేశ్వర్లు, ఎంబీ నర్సారెడ్డి, కోటేశ్వరరావు, పాల్గొన్నారు.

బంగారు కవచాలతో రామయ్య

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం బంగారు కవచాలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వర్ణ కవచధారి రామయ్యను తిలకించి భక్తులు పులకించిపోయారు. ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం స్వామికి బంగారు కవచాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మహిళలకు అమ్మవారి ప్రసాదంగా మంజీరా(పసుపు ముద్ద) పంపిణీ చేశారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన జరిగాయి. ప్రాకార మండపంలో సీతారాముల కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. సాయంత్రం అద్దాల మండపంలో రామయ్యకు దర్బారు సేవ జరగ్గా వేదమంత్రోచ్చరణాల మధ్య అర్చకులు భక్తులకు సంధ్యాహారతి ఇచ్చారు. 

భద్రాచలం టెంపుల్​లో మాక్​డ్రిల్​

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం అర్ధరాత్రి వరకు ఆక్టోపస్​ బలగాలు మాక్​డ్రిల్​ నిర్వహించాయి. ఒకవేళ ముష్కరులు ఆలయంలోకి ప్రవేశిస్తే వారిని ఎలా ఎదుర్కోవాలి..? భక్తులను బయటకు ఎలా తీసుకురావాలి..?  క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చి హాస్పిటల్​కి తీసుకెళ్లాలి, బలగాలు గుడిలోకి ఏఏ మార్గాల్లో వెళ్లాలి..? తదితర అంశాలపై ఆక్టోపస్​ బలగాలు ఆలయానికి రక్షణగా ఉండే ఎస్పీఎఫ్​ జవాన్లకు వివరించారు. రాత్రి 9 గంటల నుంచే స్థానిక పోలీసుల సహకారంతో ఆక్టోపస్​ బలగాలు ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసులను కూడా ప్రధాన ఆలయంలోకి రానీయలేదు. సుమారు 100 మంది భద్రతాలోపాలను అన్వేషించారు. ఆలయంలో బాంబులు ఏర్పాటు చేస్తే స్క్వాడ్​ల ద్వారా నిర్వీర్యం చేయించడం వివరించారు. సీసీ కెమెరాలు వినియోగం, భక్తుల రద్దీలో ముష్కరులను గుర్తించడం, అనుమానిత వస్తువులు, వ్యక్తుల వివరాలు తెలుసుకోవడంపై అవగాహన కల్పించారు. 

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 

ములకలపల్లి, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ములకలపల్లిలోని రైతు వేదిక వద్ద లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటి వరకు రూ.11 కోట్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా తిమ్మంపేటకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ములకలపల్లి ఏఈఓ ని మార్చాలని ఎమ్మెల్యే కు పలువురు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, సర్పంచ్ భద్రం, తహసీల్దార్​వీరభద్రం, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఏవో కరుణామయి తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు హాస్పిటల్​లో బర్త్​ వెయిటింగ్​ రూమ్​లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇల్లందు గవర్నమెంట్​ హాస్పిటల్​లో బర్త్​ వెయిటింగ్​ రూమ్​లు ఏర్పాటు చేయాలని కలెక్టర్​ అనుదీప్​ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో వైద్యాధికారులతో శుక్రవారం నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్​ హాస్పిటల్స్​లలో బయోమెట్రిక్​ అటెండెన్స్​ ను అమలు చేయాలన్నారు. ప్రజలకు వైద్య సేవలందించడంలో సిబ్బంది సమయ పాలన పాటించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా గైనకాలజిస్ట్​లను నియమించామని, గవర్నమెంట్​ హాస్పిటల్స్​లలో డెలివరీల సంఖ్య పెరగాలని సూచించారు. అశ్వారావుపేట హాస్పిటల్​లో ఆపరేషన్​ థియేటర్​కు త్వరగా రిపేర్​చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మీటింగ్​లో డీఎంఈ ప్రిన్సిపల్​ డాక్టర్​ లక్ష్మణ్​రావు, సూపరింటెండెంట్​ కుమారస్వామి, హాస్పిటల్స్ కో ఆర్డినేటర్​ డాక్టర్​ రవిబాబు, వైద్యశాఖాధికారులు పాల్గొన్నారు.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గవర్నమెంట్​హాస్పిటల్స్​ బలోపేతానికి కలెక్టర్​ అనుదీప్​ ఆధ్వర్యంలో డీసీహెచ్​ఎస్​ డాక్టర్​ రవిబాబు అద్భుతంగా పనిచేస్తున్నారని వైద్యవిధాన పరిషత్​ కమిషనర్​ అజయ్​ అన్నారు. హైదరాబాద్​నుంచి జూమ్​ మీటింగ్​లో వైద్య సేవలు, సౌకర్యాలపై కలెక్టర్​, వైద్యాశాఖాధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. రెండు మూడు నెలలుగా మారుమూల ప్రాంతాలు చర్ల, అశ్వారావుపేట, ఇల్లందు, బూర్గంపహడ్​, మణుగూరు హాస్పిటల్స్​లో మొత్తం 37 మంది డాక్టర్లను నియమించడంపై కమిషనర్​హర్షం వ్యక్తం చేశారు. హాస్పిటల్స్​లలో ఆపరేషన్స్​ థియేటర్స్​ 
ప్రారంభించడంతో పాటు తొమ్మిది మంది గైనకాలజిస్ట్​లను నియమించడం అభినందనీయమన్నారు.