హైదరాబాద్, వెలుగు: బీజేపీకి లాభం చేకూర్చేందుకే బీఆర్ఎస్ తో కలిసి దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఎంఐఎం ప్రకటించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఈ చర్య మత రాజకీయాలకు మేలు చేసి, దేశ సమైక్యత, సమగ్రతకు నష్టం కలిగిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలోని రెండు ఫ్రంట్లకు సమదూరం పాటిస్తామని బీఆర్ ఎస్ ప్రకటించడం కూడా బీజేపీకి దోహదం చేయడమేనన్నారు. గతంలోనూ ఎంఐఎం పలు రాష్ర్టాల్లో పోటీ చేసి బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చిందని విమర్శించారు. పలు చట్టాలతో దేశంలోని మైనార్టీల హక్కులు కాలరాయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంటే వారికి మేలు జరిగేలా ఎంఐఎం వ్యవహరించడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఎంఐఎం తన వైఖరీని మార్చుకోవాలన్నారు.