గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్చేశారు. శనివారం ఆసిఫాబాద్వెళ్తూ గోదావరిఖనిలోని సీపీఎం ఆఫీస్కు వెళ్లి కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..పెద్దపల్లి జిల్లాలో పేద ప్రజలు ఇండ్ల స్థలాల కోసం ఎన్నో పోరాటాలు చేసి గుడిసెలు వేసుకున్నారని పేర్కొన్నారు. వారికి పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బిల్లును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రానికి చెందిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించాలని లేదంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నేతలు బండారు రవికుమార్, కె.భూపాల్, వై.యాకయ్య, ఏ.మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, టి.రాజారెడ్డి ఉన్నారు.
