వానలకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

వానలకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వారం రోజులుగా కురిసిన వానలకు వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో లక్షల ఎకరాల్లో పంటలు నాశన మయ్యా యి. వరి చేన్లు నీట మునిగాయి. పత్తి చేన్లలో నీళ్లు నిలువడంతో పూత, కాత దశలో పంట దెబ్బతిన్నది. మొలకెత్తి ఏపుగా పెరుగుతున్న కంది చేన్లు నేలకొరిగాయి. పెసర, సోయాబీన్ పంటలకు నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంటలపై ఎఫెక్ట్ పడింది. రెండు లక్షల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయని అంచనా. ఇందులో పత్తి, వరి కలిపి లక్షా 70 వేల ఎకరాల్లో, మరో 30 వేల ఎకరాల్లో ఇతర పంటలు నీట మునిగినట్టు సమాచారం. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లోపంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో పంట నష్టంపై వ్యవసాయ అధికారులు లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు లక్షన్నర ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టుగా గుర్తించారు.

పెసర రైతులను ముంచిన వానలు

ఈ సారి పెసర్లకు మద్దతు ధర క్వింటాల్‌‌‌‌‌‌‌‌ రూ.7,196 ఉండటంతో చాలా మంది రైతులు పునాస పంటగా పెసర వేశారు. మంచి ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. కానీ పెసర తెంపే దశలో వానలు పడటంతో పంట నాశనం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర ఎకరాల్లో పెసర వేయగా.. 90 శాతం పంటకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

 నోటిఫికేషన్ ఇయ్యని సర్కార్..

కేంద్రం నాలుగేళ్లుగా ఫసల్‌ ‌‌‌‌‌‌‌బీమా యోజనను అమలు చేస్తోంది. బీమా ప్రీమియంలో రైతు కొంత చెల్లిస్తే, మిగతా సొమ్ములో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు రైతులు బ్యాంకుల్లో లోన్లు తీసుకునేటప్పుడే పంటల బీమా ప్రీమియం కట్‌‌ ‌‌‌‌‌‌చేసుకునేవారు. కేంద్రం ఇటీవల ఈ విధానాన్నిమార్చింది. రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌‌‌‌‌‌‌ఇవ్వాలి. తర్వాత రైతులు మీ సేవా సెంటర్లలో పంట బీమాకు నమోదు చేసుకోవాలి. వరదలు, ఇతర ప్రకృతి విపత్తులకు కూడా ఇది వర్తిస్తుంది. పంటల సీజన్ మొదలయ్యే జూన్‌‌లోనే రాష్ట్ర ప్రభుత్వం బీమా స్కీం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర సర్కారు ఈ నోటిఫికేషన్ జారీ చేయకుండా బీమా స్కీంను ఆపేసింది.

రెండేళ్లుగా నిర్లక్ష్యం..

ఈసారి ఎత్తివేత ఫసల్‌ ‌‌‌‌‌‌‌బీమా మొదలైన రెండేండ్ల పాటు ప్రీమియం వాటా చెల్లించిన రాష్ట్ర సర్కారు తర్వాత దానిని పక్కన పెట్టేసింది. రైతులు వాటా చెల్లిస్తున్నా రాష్ట్ర సర్కారు ప్రీమియం కట్టడం లేదు. రాష్ట్రం వాటా కడితే.. కేంద్రం తన వంతుగా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. రెండేండ్లుగా రాష్ట్రం వాటా కట్టకపోవడంతో కేంద్రం కూడా ఇవ్వలేదు. ప్రీమియం సొమ్ము అందకపోవడంతో బీమా కంపెనీలు పంట నష్టపరిహారం ఆపేశాయి. గత రెండేళ్లకు సంబంధించి రాష్ట్ర సర్కారు రూ.513.5 కోట్లు కట్టాల్సి ఉంది. బీమా కంపెనీలు రాష్ట్ర రైతులకు ఇవాల్సిన రూ.960 కోట్ల పరిహారాన్ని నిలిపివేశాయి. ఈ సారైతే సర్కారు అసలు బీమా అమలు చేయడానికే ముందుకు రాలేదు.

పంట మునిగితే..రైతు మునుగుడే

రాష్ట్ర సర్కారు ఈసారి పంటలకు బీమా చెయ్యలేదు. జూన్‌‌లోనే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు. గత నాలుగైదేళ్లుగా పంట నష్టం జరిగితే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీకి కూడా పైసా
ఇవ్వలేదు. దీంతో వర్షాలు,వరదలతో పంటలు నష్టపోయిన రైతులు నిండా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో ఇప్పటికే ఐదులక్షల ఎకరాల్లో పంటలపై ఎఫెక్ట్
పడిందని, సుమారు రెండు లక్షల ఎకరాల్లో తీవ్రంగా నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. బీమా
లేకపోవడంతో ఈ రైతులెవరికీ పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది.