Oil Prices: ఇరాన్ పై ఇజ్రాయిల్ యుద్ధం: మండిపోతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. మనకు పెట్రోల్ రేట్లు పెరుగుతాయా..?

Oil Prices: ఇరాన్ పై ఇజ్రాయిల్ యుద్ధం: మండిపోతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. మనకు పెట్రోల్ రేట్లు పెరుగుతాయా..?

Fuel Prices: మధ్యప్రాశ్చంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెంచుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు దిగటంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా వీటి ధరలను పెంచుతున్నాయి. 

ఈ ఉద్రిక్తతలు ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో నేడు బ్యారెల్ చమురు ధర ఏకంగా 13 శాతం భారీ పెరుగుదలను చూసింది. అయితే ఈ పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్దం దిశగా దారితీసే ప్రమాదం ఉందని అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

తాజాగా యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 11.38 శాతం పెరిగి 75.82 డాలర్లకు చేరుకుంది. ఇదే క్రమంలో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 10.28 శాతం పెరిగి 76.48 డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా అత్యధికంగా చమురు నిక్షేపాలను కలిగి ఉన్న మధ్యప్రాశ్చం నుంచి ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాలు ఏర్పడతాయనే ఆందోళనలు పెరగటం చమురు ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ అమెరికా అండ లేకున్నప్పటికీ దాడులు చేయటం ఆందోళనలు మరింత పెరిగేలా చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ భూభాగంపై ముందస్తు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించిన కొన్ని గంటల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు కుతకుతలాడుతున్నాయి. ఇరాన్ చేయబోయే దాడిని నివారించడానికి ఈ దాడులు అవసరమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వ్యాఖ్యానించారు. క్షిపణులు, డ్రోన్ల ద్వారా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఊహించి ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ దాడిలో అమెరికా పాత్ర లేదని తెలుస్తోంది. అమెరికా సిబ్బందిని రక్షించటం తమ ప్రాధాన్యతంగా ఇజ్రాయెల్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. 

ప్రస్తుతం భారత్ తన అవసరాల కోసం క్రూడ్ ఆయిల్ ను రష్యాతో పాటుగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా, నైజీరియా, అంగోలా, కువైట్ వంటి దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే ఇరాన్ నుంచి పెద్దగా దిగుమతులు లేకపోవటం కారణంగా భారతీయులపై ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలను పెంచటం వల్ల పరోక్షంగా భారత్ కూడా ప్రభావితం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.