- పరిమితంగానే విజిటర్లను అనుమతిస్తామన్న ప్రభుత్వం
- ఆరో అంతస్తులోని సీఎంఓలోకి నో ఎంట్రీ
- వందలాది మంది పోలీసులు, సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ లోకి విజిటర్లను అంత ఈజీగా అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా సీఎం, సీఎంవో ఉండే ఆరో అంతస్తులోకి అసలు ఎంట్రీనే ఉండదని తెలిపింది. ఇతర అంతస్తుల్లోని డిపార్ట్ మెంట్లకు కూడా పరిమితంగానే విజిటర్లను అనుమతించనున్నట్లు పేర్కొంది. వీరికి కూడా లోపలి నుంచి ఓకే చెబితేనే అనుమతి ఉండనుంది. ఈ నెల17న కొత్త సెక్రటేరియెట్ను ఓపెన్ చేయనుండగా భద్రతా ఏర్పాట్లపై సీఎస్శాంతికుమారి మంగళవారం రివ్యూ చేశారు.
..ఎంట్రీ అంత ఈజీ కాదు
కార్పొరేట్ ఆఫీసుల మాదిరి సెక్రటేరియేట్కు వచ్చే విజిటర్స్ కు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇస్తామని, వాళ్లపై మానిటరింగ్ ఉంటుందని చెప్పారు. మూడు కంపెనీల బెటాలియన్లు, 300 మంది సిటీ పోలీస్ అధికారులు, 300 సీసీ కెమెరాలతో రౌండ్ది క్లాక్మానిటరింగ్ ఉంటుందని సీఎస్ కు ఆఫీసర్లు వివరించారు. 560 కార్లు, 900కు పైగా బైక్ల పార్కింగ్ కు సదుపాయం కల్పించినట్లు తెలిపారు. బ్యాగేజ్, వెహికిల్, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సెక్రటేరియట్ చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. 34 మంది సిబ్బందితో రెండు ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచనున్నారు. కాగా, 11న జరుగనున్న ఫార్ములా ఈ–-రేసింగ్ ఏర్పాట్లపై కూడా సీఎస్సమీక్షించారు. రేస్ సందర్భంగా ఫిబ్రవరి 5 నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు, మింట్ కాంపౌండ్ నుంచి ఐ-మాక్స్ వరకు రోడ్లను మూసివేయనున్నారు. ప్రత్యామ్నాయ రూట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, స్పెషల్సీఎస్అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.