ఆదిలాబాద్ లో ప్రశాంతంగా బంద్..రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్

ఆదిలాబాద్ లో ప్రశాంతంగా బంద్..రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్
  • బస్ డిపో ఎదుట మాజీ మంత్రి జోగురామన్న బైఠాయింపు, అరెస్ట్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్​ ప్రశాంతంగా జరిగింది. బస్​ డిపో ఎదుట మాజీ మంత్రి, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ నాయకులతో కలిసి బైఠాయించగా, పోలీసులు అరెస్ట్​ చేశారు. ఉదయం 5 గంటల నుంచి బస్​ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకోవడంతో డీఎస్పీ జీవన్​రెడ్డి అక్కడికి చేరుకొని వారిని సముదాయించినప్పటికీ వినకపోవడంతో అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. 

అనంతరం బీఆర్ఎస్​ నాయకులు పట్టణంలో బైక్​ ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూసి వేయించారు. పలువురు స్వచ్ఛందంగా బంద్​ పాటించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. నాఫెడ్, మార్క్​ఫెడ్  కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్​ అయ్యారు. మాజీ మున్సిపల్​  చైర్మన్​ జోగు ప్రేమేందర్, నాయకులు యాసం నర్సింగ్​రావు, పట్టణ అధ్యక్షుడు అజయ్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లా ద్, యూనుస్  అక్బానీ, జోగు మహేందర్, గండ్రత్ రమేశ్, సాజిదోద్దీన్​ పాల్గొన్నారు.