
-
ఒక్క ఎస్పీడీసీల్పరిధిలోనే దాదాపు రూ.2 వేల కోట్లు
-
ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల నుంచి కలెక్టర్, ఎస్పీ బిల్డింగులు, ఉన్నతాధికారుల నివాసాలది ఇదే పరిస్థితి
-
ఆ భారం వివిధ పన్నుల రూపాల్లో సామాన్యులపైనే ?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కార్ఆఫీసుల కరెంట్బిల్లుల బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయాయి. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల నుంచి కలెక్టర్, ఎస్పీ బిల్డింగులు, జిల్లా పరిషత్లతో పాటు ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల కరెంట్బిల్లులు పెండింగ్లో పడ్డాయి. సామాన్యులు వందల్లో వచ్చిన బిల్లు కట్టకపోతేనే కరెంటు కట్ చేసే విద్యుత్ అధికారులు పెద్దోళ్లు, ఉన్నతాధికారులు లక్షల రూపాయల బిల్లులు కట్టకున్నా సప్పుడు చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకే కాకుండా, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లకు వాడుకుంటున్న కరెంటుకు కూడా నెలనెలా బిల్లులే కట్టడం మానేశారు. ఒక్క దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) పరిధిలోనే ఏకంగా 14,142 మంది వినియోగదారులు రూ.50 వేలకు పైగా కరెంటు బిల్లు బకాయి ఉన్నారు. ఇలా దాదాపు రూ.2 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో 70 శాతం సర్కార్ కు చెందినవే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మరికొన్ని గ్రామ పంచాయతీలు, ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇలా ఎస్పీడీసీఎల్ పరిధిలోనే కాకుండా ఎన్పీడీసీఎల్ లో కూడా వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్, సర్కార్వి అన్నీ కలిపితే రూ.12 వేల కోట్లు ఉన్నట్లు ఈఆర్సీ ఇటీవల ప్రకటించింది.
నల్గొండ జెడ్పీ బకాయి రూ.74 లక్షలు
లిస్ట్లో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కరెంట్ బిల్లులు ఎగ్గొడుతున్న లిస్ట్ లో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కూడా ఉన్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రూ.8.89 లక్షల బకాయి ఉండగా.. ఎమ్మెల్యే రెసిడెన్స్ కమ్ క్యాంప్ ఆఫీస్ బకాయి రూ.7.39 లక్షలు ఉంది. అలాగే, సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల బిల్లులు కూడా పేరుకుపోయాయి. కొందరు ఉన్నతాధికారులు నివాసముంటున్న ప్రభుత్వ క్వార్టర్లకు సైతం కరెంటు బిల్లులు కట్టడం లేదు.
వసూలు చేయకుండా దాచేస్తున్నారు..
ఆ భారం సామాన్యులపైనే !
ప్రభుత్వ శాఖల్లోనే గుట్టలుగా పేరుకుపోయిన బకాయిలను వసూల్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ భారాన్ని ప్రజలపై రుద్దీ ఆ పన్నులు.. ఈ ట్యాక్సులంటూ సామాన్యుడి నడ్డివిరుస్తున్నారని మండిపడుతున్నారు. ఏడాదికోసారి రకరకాల చార్జీల పేరుతో బిల్లుల మోత మోగిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ డెవలప్మెంట్ చార్జీల పేరిట అదనపు వసూళ్లు చేసిన కరెంట్ సంస్థలు.. ఆగస్టులో గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారనే సాకుతో అడ్వాన్స్ కన్జంప్షన్ డిమాండ్ (ఏసీడీ) పేరుతో అడ్డగోలుగా డిపాజిట్లు గుంజాయి. రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలకు నిర్వహణ కింద నిధులు రిలీజ్ చేయకపోవడంతోనే ఈ సమస్య వస్తుందని తెలిసింది. ఇకనైనా ప్రభుత్వ శాఖల్లో పేరుకు పోయిన కోట్లాది రూపాయల బకాయిల వసూలులో విద్యుత్ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.