- వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్ర సర్కారు
- అయినా సర్వీస్చార్జీలు కట్టాల్సిందే అంటున్న ఆఫీసర్లు
- అవగాహన లేక కట్టని రైతులు ఏండ్లుగా బిల్లుల పెండింగ్
- గద్వాల జిల్లాలోనే 50 ట్రాన్స్ ఫార్మర్లు బంద్
- పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో ఎండుతున్న పంటలు
గద్వాల, వెలుగు: రైతులు వ్యవసాయ కనెక్షన్లకు సర్వీస్ చార్జీలు కట్టడం లేదని ట్రాన్స్కో ఆఫీసర్లు కనెక్షన్లు కట్ చేస్తున్నారు. గతంలో పొలాల్లో తిరుగుతూ స్టార్టర్లు పీక్కెళ్లగా ఇప్పుడు ఏకంగా ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్బంద్ పెడుతున్నారు. డొమెస్టిక్ కనెక్షన్లు కూడా కట్ చేసి రైతుల ఇండ్లలో చీకట్లు నింపుతున్నారు. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాలోనే నాలుగు మండలాల్లో 50 ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ కట్ చేయడంతో సుమారు 400 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్ మండలాల పరిధిలోనూ మూడు రోజులుగా ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్కట్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. ఫ్రీ కరెంట్ కావడం వల్లే తాము ఎలాంటి బిల్లులు కట్టట్లేదని, కరెంటోళ్లేమో ఇలా ట్రాన్స్ ఫార్మర్లు బంద్పెడ్తూ తమ పొలాలు ఎండపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్ఫార్మర్లు బంద్ చేసి.. స్టార్టర్లు పీకేసి..
వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర సర్కారు చెబుతున్నా ట్రాన్స్కో మాత్రం సర్వీస్ చార్జీల కింద నెలకు రూ.30 చొప్పున ఏడాదికి రూ.360 వసూలు చేస్తోంది. కొంతమంది రైతులు మాత్రం తమకు సర్కారు ఫ్రీ కరెంట్ఇస్తుండగా, మళ్లీ ఈ సర్వీస్ చార్జీలు తామెందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. సర్వీస్ చార్జీల గురించి తెలిసిన కొంతమంది చెల్లిస్తుండగా, అసలు సర్వీస్ చార్జీల సంగతి తెలియని వారు కట్టకపోవడంతో ఏండ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి వసూళ్ల కోసం తిరుగుతున్న ట్రాన్స్కో సిబ్బంది అన్ని జిల్లాల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి స్టార్టర్లు పట్టుకెళ్తున్నారు. సర్వీస్ చార్జీలు మొత్తం కట్టాకే తిరిగి ఇచ్చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని పరిధిలోని రైతులందరూ సర్వీస్ చార్జీలు కడితేనే రిపేర్ చేస్తున్నారు. కాగా, సహనం కోల్పోతున్న రైతులు ఇటీవల స్టార్టర్లు ఎత్తుకెళ్లేందుకు వస్తున్న స్టాఫ్పై తిరగబడుతున్నారు. దీంతో ట్రాన్స్ కో ఆఫీసర్లు కొత్త ఐడియా ఆలోచించారు. బకాయిలు ఎక్కువగా ఉన్నచోట్ల మూడురోజులుగా ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ కట్ చేస్తున్నారు. ఫలితంగా ఆయా ట్రాన్స్ఫార్మర్ల కింద సర్వీస్ చార్జీలు కట్టని, కట్టిన రైతుల పొలాలు కూడా ఎండిపోతున్నాయి.
ఇంటి కరెంట్ బిల్లులో కలుపుతున్నరు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ట్రాన్స్కో సిబ్బంది నాలుగు రోజులుగా రైతులు సర్వీస్ చార్జీలు కట్టడం లేదని ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్కట్చేస్తున్నారు. ఇప్పటికే ధరూర్, కేటి దొడ్డి, గద్వాల, గట్టు మండలాల్లోని 30 గ్రామాల పరిధిలో 50 ట్రాన్స్ ఫార్మర్లకు కరెంట్ బంద్ పెట్టారు. అసలే ఎండాకాలం కావడంతో బావులు, బోర్ల కింద వేసిన వరి, ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్ మండలాల పరిధిలో పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లకు నాలుగు రోజులుగా కరెంట్కట్ చేశారు. ఎన్నిరకాలుగా హెచ్చరించినా సర్వీస్ చార్జీలు కట్టకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ కట్ చేస్తున్నామని ట్రాన్స్కో ఆఫీసర్లు చెబుతున్నారు. చాలా జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లపై సర్వీస్ చార్జీలను ఇంటి కరెంటు బిల్లులో చేర్చి చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. గద్వాల, నల్గొండ లాంటి జిల్లాల్లో కొద్దిరోజులుగా సర్వీస్ చార్జీల నెపంతో రైతుల ఇండ్లకు కరెంట్కట్చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని హత్నూర, సికింద్లాపూర్, బోర్పట్ల, కాసాల, నాగులదేవులపల్లి, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. రోజంతా కరెంట్ నిలిపేస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కాగా, ఒక్కో రైతు దాదాపు రూ.2వేల నుంచి రూ.8వేల వరకు బాకీ పడ్డారని కరెంటోళ్లు చెబుతున్నారు. ముం దస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదని రైతులు వాదిస్తున్నారు. పంట మధ్యలో వేలకు వేలు తెచ్చి కట్టమంటే తాము ఎక్కడి నుంచి తెస్తామని, పంట పండి చేతికి డబ్బు వచ్చాక కట్టే అవకాశం కల్పించాలని కొందరు కోరుతున్నారు.
ఇయర్ ఎండింగ్ అవుతోందని ఒత్తిడి తెస్తున్నం
సర్వీస్ చార్జీలు కట్టాలని రైతులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వారిలో భయం ఉండాలనే కరెంట్ కనెక్షన్లు తొలగిస్తున్నాం. రైతుల్లో అవగాహన పెరగాలి. ఇయర్ ఎండింగ్ కావడంతో రైతులపై కొంత ఒత్తిడి తెస్తున్నాం. వారు కూడా ముందుకు వచ్చి బిల్లులు కడుతున్నారు.
– మోహన్, డీఈ, జోగులాంబ గద్వాల జిల్లా
ఇండ్ల కరెంట్ కనెక్షన్ తొలగిస్తున్నరు
వ్యవసాయ కనెక్షన్సర్వీస్ చార్జీలు కట్టడం లేదంటూ ట్రాన్స్ఫార్మర్లు బంద్పెడ్తున్నరు. దీంతో పొలాలు ఎండిపోతున్నయి. వాటిని కాపాడుకునేందుకు మేము తండ్లాడుతుంటే ఇప్పుడు మా ఇండ్లకు కరెంట్ కట్ చేస్తున్నరు. వేల కొద్దీ బకాయిలు ఇప్పటికిప్పుడు కట్టుమంటే ఎట్ల? రైతులకు పంట పండితేనే పది పైసలు చేతికస్తయి. పంట పండినంక కట్టే చాన్స్ఇయ్యాలె.
– యుగంధర్రెడ్డి, రైతు, బీరెల్లి
పంటలు ఎండిపోతే ఎట్లా?
సర్కారేమో ఫ్రీ కరెంట్ అంటది. ఆఫీసర్లేమో సర్వీస్చార్జీలు అంటరు. ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ కట్ చేసి రైతుల పంటలను ఎండవెడ్తున్నరు. ఎండిపోయిన పంటలకు ఎవరు బాధ్యత వహిస్తరు. కరెంట్ ఆఫీసర్లే పరిహారం ఇయ్యాలె. అందరూ వచ్చి రైతుల మీదనే రుబాబు చూపిస్తున్నరు.
– రవీంద్ర నాయుడు, రైతు, ధరూర్