వివేకానందనగర్ ఏరువాక హోటల్ నుంచి.. జొమాటోలో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసిన.. కస్టమర్కు చేదు అనుభవం

వివేకానందనగర్ ఏరువాక హోటల్ నుంచి.. జొమాటోలో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసిన.. కస్టమర్కు చేదు అనుభవం

హైదరాబాద్: కూకట్ పల్లి వివేకానంద నగర్కు చెందిన ఓ వ్యక్తికి రోజూలానే ఇవాళ (బుధవారం) ఉదయం కూడా ఆకలేసింది. కడుపు నిండా తిందామని.. జొమాటో యాప్లో దగ్గరలోని ఏరువాక హోటల్లో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న ఫుడ్ డెలివరీ బాయ్ ఏరువాక హోటల్కు వెళ్లి కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ తీసుకుని డెలివరీ చేశాడు. అయితే కస్టమర్ ఆవురావురమంటూ పార్శిల్ ఓపెన్ చేసి ఓ పాత్రలోకి సాంబార్ పోసుకుని తినడం ప్రారంభించాడు.

కొంత తిన్న తర్వాత సాంబారులో ఓ చిన్న నల్లటి ఆకారం తిరుగుతూ కనిపించింది. అదేంటి అని పరిశీలనగా చూస్తే పురుగు అని తేలింది. దీంతో అప్పటికే కొంత తిన్న కస్టమర్ వాంతులు చేసుకున్నాడు. సాంబారులో ఉన్న పురుగును వీడియోలు తీసి, సగం తిన్న ఇడ్లీ, సాంబారు పార్శిల్ను తీసుకుని ఏరువాక హోటల్కు వెళ్లాడు. మీ హోటల్లో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేస్తే పురుగు వచ్చిందని యజమానికి చూపించాడు. అయితే యాజమాన్యం మాత్రం తమ తప్పేమీ లేదని, తాము సరిగ్గానే ప్యాక్ చేసి పంపుతామని బుకాయించారు. దీంతో హోటల్ యాజమాన్యానికి, కస్టమర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

శుభ్రత పాటించరు.. 
ఏరువాక హోటల్ తీరుపై పలువురు వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాకలో ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉంటాయని, కానీ కనీస ప్రమాణాలు పాటించరని, నాణ్యత ఉండదని, ఆహారపదార్థాలు ఏమాత్రం హై జెనిక్గా ఉండవని పలువురు కస్టమర్లు మండిపడుతున్నారు.

ఒకే బాత్రూం..
ఏరువాక హోటల్కు వెళితే ఆడవారికి, మగవారికి కలిపి ఒకే ఒక బాత్రూం ఉంటుంది. ఎవరైనా అందులోకి వెళ్లాల్సిందే. లేదంటే మీ ఖర్మ అన్నట్టుగా వ్యవహరిస్తోంది హోటల్ యాజమాన్యం. ఆ ఒక్క బాత్రూం కూడా కనీసం శుభ్రంగా ఉంచరు. కనీస ప్రమాణాలు పాటించకుండా కొనసాగిస్తున్న ఏరువాక హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.