- లాభపడనున్న ఫార్మా, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలు
న్యూఢిల్లీ: ఫార్మా, కెమికల్స్, టెక్స్టైల్స్ వంటి రంగాలకు సరఫరా సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని మూడు నెలల పాటు (జూన్ 30 వరకు) రద్దు చేసింది. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.1,800 కోట్ల ఆదాయ నష్టం వస్తుందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) మెంబర్ (ట్యాక్స్ పాలసీ) సంజయ్ మంగల్ తెలిపారు.
ధరలు స్టేబుల్గా ఉంటాయని, ఉత్పత్తి కొనసాగుతుందని, సప్లయ్ చెయిన్ సాఫీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వలన గ్లోబల్ సప్లయ్ చెయిన్లో అడ్డంకులు ఎదురయ్యాయి. అందువలన కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం”అని ఆర్థిక శాఖ తెలిపింది.
ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఫార్మా, కెమికల్స్, ఆటోమొబైల్ కాంపోనెంట్లు వంటి రంగాలు ఈ రాయితీతో లాభపడతాయి. మెథనాల్, అన్హైడ్రస్ అమ్మోనియా, టాల్యూన్, స్టైరిన్, డైక్లోరోమీథేన్, వినైల్ క్లోరైడ్ మోనోమర్, పాలీ బ్యూటాడీన్, స్టైరిన్ బ్యూటాడీన్, అన్సాచురేటెడ్ పాలీస్టర్ రెసిన్స్ను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు.
