- వచ్చే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కొత్త చీఫ్ ఎన్నిక
- అప్పటిదాకా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలని విజ్ఞప్తి
- నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్.. నేతల ప్రపోజల్పై ఆలోచిస్త: రాహుల్ గాంధీ
- ఇప్పటికి నేనే ఫుల్ టైమ్ ప్రెసిడెంట్: సోనియా గాంధీ
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి.. మళ్లీ రాహుల్ గాంధీ ముందుకే వచ్చి ఆగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఇందుకు వేదికైంది. మరోసారి పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాలని నేతలందరూ అడగడంతో.. రాహుల్ సానుకూలంగా ఉన్నట్టు కనిపించారు. తనపై నమ్మకం ఉంచినందుకు సీనియర్లకు థ్యాంక్స్ చెప్పిన ఆయన.. తిరిగి కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్లో (సంస్థాగత) ఎన్నికలు జరిగే దాకా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలని కొందరు నేతలు సమావేశంలో ప్రతిపాదించారని తెలిపారు. అయితే తనకు పార్టీ నాయకుల నుంచి ఐడియాలజీ పరంగా క్లారిటీ కావాలని రాహుల్ కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమేనని నేతలు చర్చించుకుంటున్నారు.
‘‘అందరూ అనుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీకి నేను టెంపరరీ చీఫ్ను కాదు. ప్రస్తుతానికి పూర్తిస్థాయి ప్రెసిడెంట్ని. కొంతమంది సభ్యులు పార్టీలో చాలా మార్పులు కావాలని కోరుకుంటున్నారు. దానికన్నా ముందు పార్టీలో క్రమశిక్షణ అవసరం. పార్టీలో ఏదైనా సమస్య ఉంటే నాతో చర్చించాలి. మీడియా ముందుకు వెళ్లవద్దు’’ అని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. హైకమాండ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ‘జీ23’ నేతల్ని ఉద్దేశించి సోనియా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ మనుగడకు, అధికార పార్టీపై పోరాటానికి నేతల్లో యూనిటీ, సెల్ఫ్ కంట్రోల్, క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. ‘‘మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనమందరం స్వేచ్ఛగా, నిజాయితీగా చర్చించుకుందాం. సీడబ్ల్యూసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల గురించే బయట మాట్లాడాలి” అని సూచించారు. రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితిని నాశనం చేసిందని సోనియా మండిపడ్డారు. ఎకానమీ రికవరీ కోసం ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తోందని విమర్శించారు. లఖీంపూర్ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించిన సోనియా.. మూడు అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలన్నారు.
నవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు
వచ్చే ఏడాది ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ఎన్నికల షెడ్యూల్ను సీడబ్ల్యూసీ ముందు సోనియా పెట్టారు. ఇందులో భాగంగా నవంబర్ 1 నుంచి భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతామని, మార్చి 31 దాకా దానిని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. పీసీసీ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, పీసీసీ ఎగ్జిక్యూటివ్స్, ఏఐసీసీ మెంబర్స్ తదితరుల ఎంపిక వచ్చే ఏడాది జులై 21 నుంచి ఆగస్టు 20 మధ్య జరుగుతుందని తెలిపారు. సీడబ్ల్యూసీ మెంబర్ల ఎన్నిక పార్టీ ప్లీనరీ సెషన్లో జరుగుతుందని, తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఏడాదిలో ఎన్నిక.. అప్పటిదాకా సోనియానే!
దాదాపు రెండేళ్ల తర్వాత శనివారం తొలిసారి సీడబ్ల్యూసీ మీటింగ్ ఫిజికల్గా జరిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసులో శనివారం 6 గంటలపాటు సాగిన ఈ భేటీకి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్, చరణ్జిత్ చన్నీ, జీ23 నేతలు ఆజాద్, ఆనంద్ శర్మ సహా 50 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. సోనియా తర్వాత కాంగ్రెస్ పార్టీ చీఫ్గా రాహుల్ గాంధీ పేరును రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అందరు నేతలు ఓకే చెప్పారు. కాంగ్రెస్కు రాహుల్ ప్రెసిడెంట్ అవ్వాలని నేతలు కోరుకుంటున్నారని పార్టీ సీనియర్ లీడర్ అంబికా సోని చెప్పారు. మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె.. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది ఆగస్టు– సెప్టెంబర్ మధ్య జరుగుతాయన్నారు.
అప్పుడు ససేమిరా..
గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో 2019 మేలో పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. పార్టీ నేతలు ఎంత బతిమిలాడినా రాహుల్ ససేమిరా అన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఒప్పుకోలేదు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు 2019 ఆగస్టులో కాంగ్రెస్ చీఫ్గా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడం, పార్టీ ఎట్లా నడవాలనేది చెప్పే వాళ్లు లేకపోవడంపై సీనియర్లు కొన్ని నెలలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఎవరూ లేరని, మరి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తెలియడం లేదని సీనియర్ నేత కపిల్ సిబల్ ఘాటు కామెంట్లు చేశారు. ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ లాంటి లీడర్లు కూడా ఇలానే స్పందిస్తున్నారు. పార్టీ ఫుల్ టైమ్, యాక్టివ్ ప్రెసిడెంట్ కోసం ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కిందటేడాది ఆగస్టులో 23 మంది సీనియర్ నేతలు ఏకంగా సోనియాకే లెటర్ రాయడం దుమారమే రేపింది. దీంతో గత జనవరి 22న సమావేశమైన సీడబ్ల్యూసీ.. జూన్ కల్లా ప్రెసిడెంట్ను ఎన్నుకోవాలని నిర్ణయించింది. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆ నిర్ణయాన్ని మే 10న విరమించుకుంది. సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించాలని పార్టీలోని కొన్ని వర్గాలు డిమాండ్ చేయడం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నేతల మధ్య వివాదాలు జరుగుతున్న దశలో తాజా భేటీ జరిగింది.