వర్క్‌‌‌‌ ఫ్రం హోమ్‌‌‌‌ పేరుతో మోసాలు ...ఇద్దరు సైబర్‌‌‌‌ నేరగాళ్ల అరెస్ట్‌‌‌‌

వర్క్‌‌‌‌ ఫ్రం హోమ్‌‌‌‌ పేరుతో మోసాలు ...ఇద్దరు సైబర్‌‌‌‌ నేరగాళ్ల అరెస్ట్‌‌‌‌

ఆదిలాబాద్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : సైబర్‌‌‌‌ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఆదిలాబాద్‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్‌‌‌‌ మహాజన్‌‌‌‌ సోమవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్‌‌‌‌ రూరల్‌‌‌‌ మండలం జందాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన చెన్న శివకుమార్‌‌‌‌ అనే వ్యక్తి ప్రైవేట్‌‌‌‌ ఉద్యోగం చేస్తుంటాడు. 

ఇతడికి ఇటీవల వర్క్‌‌‌‌ ఫ్రం హోమ్‌‌‌‌, ప్రతి రోజు రూ. 2 వేల నుంచి రూ. 8 వేల వరకు సంపాదించుకోవచ్చు అంటూ వాట్సప్‌‌‌‌, టెలిగ్రామ్‌‌‌‌లో ఓ మెసేజ్‌‌‌‌ వచ్చింది. అది నిజమేనని నమ్మిన శివకుమార్‌‌‌‌ ఆ మెసేజ్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు లైన్‌‌‌‌లోకి వచ్చి చాటింగ్‌‌‌‌ మొదలు పెట్టారు. ముందుగా తక్కువ మొత్తంలో డబ్బులు పంపించి నమ్మించారు. తర్వాత కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే మరింత సంపాదించుకోవచ్చని ఆశ పెట్టడంతో వారు చెప్పినట్లుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. 

ఇలా పలు విడతలుగా మొత్తం రూ. 5,03,000 పెట్టుబడి పెట్టాడు. ఈ డబ్బులు అతడి వాలెట్‌‌‌‌లో కనిపించినా.. విత్‌‌‌‌డ్రా చేసుకునేందుకు వీలు కాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన శివకుమార్‌‌‌‌ ఈ నెల 14న రూరల్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు.. సైబర్‌‌‌‌ నేరగాళ్లు మధ్యప్రదేశ్‌‌‌‌లో ఉన్నట్లు గుర్తించారు. 

తర్వాత మధ్యప్రదేశ్‌‌‌‌లోని తికమ్‌‌‌‌గఢ్‌‌‌‌ జిల్లాకు వెళ్లి సౌరబ్‌‌‌‌ రాయక్వార్‌‌‌‌, రితిక్‌‌‌‌సేన్‌‌‌‌ను పట్టుకొని ఆదిలాబాద్‌‌‌‌కు తీసుకొచ్చారు. వారి నుంచి నాలుగు సెల్‌‌‌‌ఫోన్స్‌‌‌‌, ఒక ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, మూడు బ్యాంక్‌‌‌‌ పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌, పాన్‌‌‌‌కార్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరికొంత మంది ఉన్నారని, వారిని సైతం పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్‌‌‌‌రెడ్డి, సీఐ కె.ఫణిదర్, ఎస్సై వి.విష్ణువర్ధన్‌‌‌‌ పాల్గొన్నారు.