ఘట్ కేసర్, వెలుగు: బ్యాంక్ ప్రోమో కోడ్ నంబర్ అడిగి సైబర్ నేరగాళ్లు రూ. లక్ష కాజేశారు. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఎదులాబాద్ కు చెందిన వెల్లంకి రాజ నర్సింహయ్య(56) సౌత్ ఇండియా బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేశాడు. కొద్దిసేపటికి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. సౌత్ ఇండియా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, ఫోన్ కు వచ్చిన ప్రోమో కోడ్ నంబర్ ను లింకులో నమోదు చేయాలని కోరాడు.
వెంటనే రాజనర్సింహయ్య ఎంటర్ చేశాడు. అతని ఫోన్ పే నుంచి రూ. 96,543 నగదు డెబిట్ అయింది. దీంతో ఆందోళన చెందిన బాధితుడు బ్యాంక్ అధికారులను సంప్రదించగా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డట్టు గుర్తించారు. ఘట్ కేసర్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.