
- డిస్కౌంట్ తో చలాన్లు కట్టే వారి డబ్బు కొట్టేసే ప్లాన్
- అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు ఈ చలాన్స్సైట్ను టార్గెట్ చేశారు. పెండింగ్ చలాన్స్ క్లియరెన్స్ చేసే వాహనదారుల నుంచి డబ్బు కొట్టేసేందుకు నకిలీ యూఆర్ఎల్, పోర్టల్స్తో గాలం వేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నకిలీ వెబ్సైట్ను పోలీసులు గుర్తించి అప్రమత్తం అయ్యారు. సిటీ పోలీసుల వెబ్సైట్తో పాటు సోషల్ మీడియాలోనూ హెచ్చరిస్తున్నారు.
సేమ్పోర్టల్ తయారు చేసి..
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్స్ పెండింగ్లో ఉండగా సోమవారం వరకు 45 లక్షలకు పైగా చలాన్స్ క్లియర్ అయ్యాయి. చలాన్స్ క్లియరెన్స్ కోసం ఆన్లైన్లో పేమెంట్ చేసేందుకు వాహనదారుల పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారిక సైట్ను ఓపెన్ చేస్తుండటంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు echallantspolice.in పేరుతో నకిలీ వెబ్సైట్ను రూపొందించారు. ఈ సైట్ను ఓపెన్ చేసే వాహనదారుల వెహికల్ నంబర్తో పాటు ఏటీఎమ్ కార్డ్ నంబర్తో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేలా నకిలీ ప్రాసెస్ను అందులో పొందుపరిచారు.
పోలీసుల హెచ్చరికలు..
ఫేక్ సైట్ను గుర్తించిన పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలీస్ వెబ్సైట్తో పాటు సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఐడీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెబ్పేజ్లో అలర్ట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ చేసిన తర్వాత కూడా పెండింగ్ చలాన్ కనిపిస్తే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ సైబర్ క్రైమ్ పోర్టల్,1930టోల్ఫ్రీతో కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. నకిలీ వెబ్ సైట్లను రూపొందించిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.