
- చెక్-ఇన్ , బోర్డింగ్ వ్యవస్థలకు కీలక సేవలందించే కాలిన్స్ ఏరోస్పేస్ సిస్టమ్ స్ట్రక్
- పలు విమానాలు రద్దు.. సర్వీసులు ఆలస్యం
- ట్రంప్వీసా ఆంక్షల వేళ గందరగోళం
- ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు ఇబ్బందులు
లండన్: యూరప్లోని ఎయిర్పోర్ట్లపై సైబర్ అటాక్ జరిగింది. చెక్-ఇన్ , బోర్డింగ్ వ్యవస్థలకు కీలక సేవలందించే కాలిన్స్ ఏరోస్పేస్ లక్ష్యంగా శనివారం సైబర్ దాడి జరగడంతో నిత్యం రద్దీగా ఉండే పలు అంతర్జాతీయ విమానాశ్రాయాల్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆటోమేటెడ్ వ్యవస్థలు వైఫల్యం చెందడంతో మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ నిర్వహించాల్సి వచ్చింది. లండన్లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మీనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
దీంతో అనేక విమానాలు ఆలస్యం కాగా.. పలు సర్వీసులు రద్దయ్యాయి. వివిధ దేశాలకు వెళ్లాల్సిన వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు అప్డేట్కోసం సంబంధిత వెబ్సైట్లను చూడాలని ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. హెచ్ 1బీ వీసాదారులు ఈ నెల 21 లోగా అమెరికాకు రావాలని ఆ దేశం ఆదేశించిన రోజే ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
మ్యూస్ సాఫ్ట్వేర్పై ప్రభావంతో..
ఎయిర్పోర్ట్లలో ప్యాసింజర్ ప్రాసెసింగ్ కోసం వాడే మ్యూస్సాఫ్ట్వేర్పై సైబర్అటాక్తో సేవలకు అంతరాయం కలిగిందని కాలిన్స్ ఏరోస్పేస్ ధ్రువీకరించింది. ఎయిర్పోర్ట్అథారిటీస్, ఎయిర్లైన్స్తో కలిసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. సైబర్ దాడి కారణంగా బ్రసెల్స్ విమానాశ్రయంలోని ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవలు నిలిచిపోయాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
దీంతో డజన్లకొద్దీ విమానాలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చిందని తెలిపారు. కాలిన్స్ఏరోస్పేస్ సిస్టమ్లో సాంకేతిక సమస్యల వల్ల సర్వీసులు ఆలస్యం అవుతాయని ప్రయాణికులకు హీత్రో విమానాశ్రయ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చెక్ఇన్, బోర్డింగ్ కోసం వెయిటింగ్ టైమ్ పెరుగుతుందని ప్రయాణికులకు బెర్లిన్ బ్రాండెన్బర్గ్ విమానాశ్రయ అధికారులు ముందుగానే తెలియజేశారు. సర్వీసుల స్టేటస్ను వెబ్సైట్లో చూసి నిర్ధారించుకోవాలని సూచించారు. కాగా, ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిచ్ విమానాశ్రయాల్లో సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదు.