సిమ్​ స్వాపింగ్​ : వరుసగా కాల్స్​ చేసి.. 50 లక్షలు కొట్టేశారు 

సిమ్​ స్వాపింగ్​  : వరుసగా కాల్స్​ చేసి.. 50 లక్షలు కొట్టేశారు 

ఓ వ్యక్తి అకౌంట్​ నుంచి దాదాపు 50 లక్షల రూపాయలను సైబర్​ దొంగలు కాజేశారు. అది కూడా ఎలాంటి ఓటీపీని అడగకుండానే.. !! ఓటీపీ లేకుండా అరకోటిని ఎలా కొట్టేశారు ? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. 50 లక్షల రూపాయలను నాలుగైదు వేర్వేరు అకౌంట్లలోకి సైబర్​ దొంగలు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం రాత్రి 7 నుంచి 8.45 గంటల మధ్య సైబర్​ దొంగల నుంచి బాధిత వ్యక్తికి వరుస కాల్స్​ వచ్చాయి.

ఫోన్​ లిఫ్ట్​ చేసిన ప్రతిసారీ..

ఢిల్లీలోని ఒక సెక్యూరిటీ సర్వీసెస్​ కంపెనీలో డైరెక్టర్​ గా వ్యవహరించే  బాధిత వ్యక్తి ఆ కాల్స్​ వెనుక దాగిన మర్మాన్ని గుర్తించలేకపోయారు. ఆయన ఆ కాల్స్​ కు జవాబిచ్చేందుకు ఫోన్​ లిఫ్ట్​ చేసిన ప్రతిసారీ అకౌంట్​ నుంచి డబ్బులు కట్​ అవుతూ పోయాయి. ఒకసారి 12 లక్షలు.. మరో రెండుసార్లు చెరో 10 లక్షలు.. ఇంకోసారి రూ.4.60 లక్షలు అకౌంట్​ నుంచి మరో అకౌంట్​ కు ట్రాన్స్​ ఫర్​ అయినట్లు మెసేజ్​ లు వచ్చాయి. ఇలా మొత్తం రూ.50 లక్షలను సైబర్​ దొంగలు తమ అకౌంట్లలోకి పంపించుకున్నారు. దీంతో లబోదిబోమని గుండెలు బాదుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులకు ఫిర్యాదు

తనకు కొత్త నంబర్స్​ నుంచి కాల్స్​ రావడం.. ఆ వెంటనే అకౌంట్​ నుంచి డబ్బులు కట్​ అయిపోవడం గురించి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీస్​ సైబర్ నిపుణులు ఈ చీటింగ్​ యాక్టివిటీ జార్ఖండ్​ లోని జాంతారా ఏరియా కేంద్రంగా జరిగిందని గుర్తించారు. సైబర్​ దొంగలు కొంత కమిషన్​ ఇస్తామనే ఆశచూపి.. పలువురి నుంచి బ్యాంకు అకౌంట్​ నంబర్లు తీసుకొని వాటిలోకి హ్యాకింగ్​ డబ్బులు (రూ.50 లక్షలు) పంపించి ఉండొచ్చని తెలిపారు. “అయితే ఈ డబ్బులు ట్రాన్స్​ ఫర్​ అయింది ఒక కరెంట్​ అకౌంట్​ నుంచి!! ఈ కరెంట్​ అకౌంట్​ నుంచి ఏకకాలంలో పెద్దమొత్తంలో నగదును ఇతర అకౌంట్లకు బదిలీ చేసే ఫెసిలిటీని యాక్టివేట్​ చేసి ఉంచారు. దీనివల్ల సైబర్​ దొంగలు ఇంత ఈజీగా పెద్ద మొత్తాలను తమ అకౌంట్లను ట్రాన్స్​ ఫర్​ చేసుకోగలిగారు”అని పోలీసులు వివరించారు. 

ఎలా హ్యాక్​ చేయగలిగారు ?

కేవలం ఫోన్​ కాల్స్​ చేయడం ద్వారా బ్యాంకు అకౌంట్​ ను సైబర్​ దొంగలు ఎలా హ్యాక్​ చేయగలిగారు ? అనే దానికి సైబర్​ నిపుణుల నుంచి ఒక సమాధానం వినిపిస్తోంది. అదే.. ‘సిమ్​ స్వాపింగ్​’. బహుశా బాధిత వ్యక్తి ఫోన్ లోని సిమ్​ ను సైబర్​ దొంగలు స్వాప్​ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సిమ్​ స్వాప్​ చేసిన ఫోన్​ కు టెక్ట్స్​ మెసేజ్​ పంపడం లేదా కాల్​ చేయడం ద్వారా హ్యాక్​ చేసే వెసులుబాటు ఉంటుందని సైబర్​ నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నిక్​ తోనే బాధితుడికి వరుస ఫోన్​ కాల్స్​ చేసి.. అతడి ఫోన్​ కు వచ్చిన ఓటీపీలను ఆడియో టూల్స్​ తో రహస్యంగా విని అకౌంట్​ ను హ్యాక్​ చేసి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు.