బంగాళాఖాతంలో తుఫాన్.. మిధిలీగా పేరు

బంగాళాఖాతంలో తుఫాన్.. మిధిలీగా పేరు

ఆగ్నేయ బంగాళాఖాతానికి  ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో  అల్పపీడనం ఏర్పడింది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 

నవంబర్ 16 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.... ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.... వాయుగుండంగా మారి ....తుఫానుగా బలపడుతుందని  IMD తెలిపింది. ఇప్పటికే ఈ తుఫానుకు  మిధిలీ అని నామకరణం చేశారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

 మిధిలీ తుఫాను వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని  వాతావరణ సంస్థ తెలిపింది. ఈశాన్య దిశగా పయనించి నవంబర్ 17న ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలోకి తుపానుగా మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే  తమిళనాడులో  ( నవంబర్ 15 వ తేదీన ఉన్న సమాచారం మేరకు) విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై లో కురిసిన    భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. తమిళనాడు రాష్ట్రానికి ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో రాబోవు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.

చెన్నైలోనూ, శివారు ప్రాంతాల్లోనూ  మరో రెండు రోజులు ( నవంబర్ 16,17) భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.  కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

దక్షిణాది జిల్లాల్లో మాత్రం చెదురుముదురు వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి కన్నియాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పెనుగాలుల కారణంగా ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ( నవంబర్ 14)  ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పడమటిదిశగా ఈశాన్య దిశగా కదులుతూ గురువారం ( నవంబర్ 16)  ఉదయం వాయుగుండంగా మారుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం ఒడిశా వైపు తీరం దాటే అవకాశాలు ఉండటం వల్ల రాష్ట్రంలో చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రతీర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో చెదురుముదురగా వర్షాలు కురుస్తాయన్నారు.

మిధానీ తుఫాను ప్రభావంతో  కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వచ్చే రెండు రోజు ( నవంబర్ 16,17) చెన్నై, రాణిపేట, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పుదుకోట, తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. రంగంలోకి దిగిన అధికారులు.. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.