
భద్రాచలం, వెలుగు: గవర్నర్ దత్తత తీసుకున్న పూసుకుంట, గోగులపూడి గ్రామాల్లో గిరిజనాభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించాలని గవర్నర్ ప్రిన్సిపుల్ సెక్రటరీ దాన కిషోర్ సూచించారు. రాజ్భవన్ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులపై రివ్యూ చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మండలం గోగులపూడి గ్రామాలకు విడుదల చేసిన రూ.47.17లక్షల నిధుల వినియోగంపై ఆయన చర్చించారు. కొండరెడ్ల కుటుంబాలలోని రైతులకు, నిరుద్యోగ యువతీ,యువకులకు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలని సూచించారు. రెండు గ్రామాల్లో 11 రకాల పనుల కోసం ఖర్చు చేసినట్లుగా ఆఫీసర్లు తెలపగా వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ఖర్చు చేసే నిధులన్నీ ఆదివాసీలకే ఉపయోగపడేలా చూడాలని ఆదేశించారు. నిధులు వృథా చేయొద్దని పేర్కొన్నారు. నిరుద్యోగులకు టెంట్ హౌస్లు, రైతులకు పవర్ టిల్లర్లు, 20 సోలార్ పంపు సెట్లు, 5కేవీ జనరేటర్ గుబ్బలమంగమ్మ ఆలయానికి, వెదురుతో తయారు చేసే కళాఖండాల తయారీకి 9 మిషన్లు, అగర్బత్తి తయారీ మిషన్, సాంబ్రాణి కప్పుల తయారీ మిషన్, తేనెటీగల పెంపకం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా ఆఫీసర్లు వివరించారు. ఐటీడీఏ పీవో బి.రాహుల్ పురోగతిపై తెలిపారు.