లష్కర్‌లో భారీ మెజారిటీతో గెలుస్తా: దానం నాగేందర్

లష్కర్‌లో భారీ మెజారిటీతో గెలుస్తా: దానం నాగేందర్

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ​గెలుపు ఖాయమని, తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్​ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. మంగళవారం ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్​లెవల్​కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశం జరిగింది. యూత్​ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అరవింద్ యాదవ్ అధ్యక్షత వహించగా, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విధ్వేషాలు రెచ్చగొడుతోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. సికింద్రాబాద్​లో కాంగ్రెస్​ను గెలిపిస్తే.. ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి.నాగభూషణం, కల్పనా యాదవ్, నల్లవెల్లి అంజిరెడ్డి, ప్రపూల్ రామ్ రెడ్డి, వాజిద్ హుస్సేన్, తిరుమల్, వీడి కృష్ణ, పాశం అనిల్ కుమార్ యాదవ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.