
బెంగళూరు: జైలు జీవితం దుర్భరంగా ఉందని, తనకు విషం ఇస్తే బాగుంటుందని తన అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో అరెస్టయిన కన్నడు నటుడు దర్శన్ తోగుదీప.. జడ్జి ఎదుట వాపోయాడు. ఆ హత్య కేసులో అరెస్టయినప్పటి నుంచి తాను సూర్యుడిని కూడా చూడలేదని తెలిపాడు. రేణుకాస్వామి హత్య కేసు విచారణపై బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ జరిపారు.
జైలు నుంచే దర్శన్ విచారణకు హాజరయ్యాడు. తన చేతులపై ఫంగస్ డెవలప్ అయిందని, బట్టలు దుర్వాసన కొడుతున్నాయని అతను తెలిపాడు. ‘‘జైల్లో నా జీవితం చాలా దుర్భరంగా ఉంది. ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. ఈ బతుకు బతకడం కన్నా చావడమే నయం అనిపిస్తోంది. కాస్త విషం ఇస్తే బాగుంటుంది” అని జడ్జికి నిందితుడు దర్శన్ విజ్ఞప్తి చేశాడు.