- బాధితురాలు నిందితులను గుర్తుపడ్తలేదనడం ఏంటి :శ్రవణ్
- టీఆర్ఎస్,ఎంఐఎంకు తొత్తుగా పోలీస్ వ్యవస్థ
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ మైనర్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుందన్నారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. రాజకీయ నేతలకు అండగా మాట్లాడుతున్నారని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలు నిందితులను గుర్తుపట్టట్లేదనడం ఏంటని ప్రశ్నించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని ఆరోపించారు. దిశ ఘటనలో రాత్రికి రాత్రి ఎన్కౌంటర్ చేశారని, నిందితుల పేర్లు, తల్లిదండ్రుల వివరాలను నిమిషాల్లో బయటపెట్టారని, పేదోడికి ఒక న్యాయం.. పెద్దోడికి ఒక న్యాయమా? అని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా వీడియో వైరల్ కాకపోతే ఎమ్మెల్యే కొడుకును తప్పించేవారన్నారు. ఘటనపై సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.