
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. 1993 ముంబై పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న దావూద్.. ఈ ఘటన తర్వాత భారత్ వదిలి పాకిస్థాన్ పారిపోయాడు. అక్కడ తలదాచుకున్న అతడికి కరోనా వైరస్ సోకిందని పాకిస్థాన్ మీడియా చానెళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అతడి భార్య మెహజబీన్ కు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని కథనాలు వస్తున్నాయి. కరాచీలోని మిలటరీ హాస్పిటల్ లో ఈ ఇద్దరికీ చికిత్స అందుతున్నట్లు తెలుస్తోంది. దావూద్ కు కరోనా పాజిటివ్ రావడంతో అతడి సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని క్వారంటైన్ కు పంపినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
1993లో ముంబై వరుస పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం. ఈ ఘటన తర్వాత అతడు పాకిస్థాన్ పారిపోయి… ఆ దేశ రక్షణలో ఉన్నాడు. కరాచీలో తలదాచుకుంటూ మాఫియా వ్యవహారాలు నడిపిస్తూనే ఉన్నాడు. అతడిని 2003లో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి భారత్, అమెరికా. దావూద్ ఇబ్రహీం తల మీద 25 మిలియన్ అమెరికన్ డాలర్ల నజరానా ఉంది. దావూద్ ఇబ్రహీంను ప్రపంచంలోని టాప్-10 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా ప్రకటించింది అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.