- జోరుమీదున్న టీమిండియా
- విరాట్ సెంచరీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
- మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
బెంగళూరు: ఓవైపు క్లీన్స్వీప్ చేయాలన్న టార్గెట్తో ఇండియా.. మరోవైపు లెక్క సరి చేయాలన్న పట్టుదలతో శ్రీలంక.. ఈ నేపథ్యంలో గార్డెన్ సిటీలో పింక్ బాల్ టెస్ట్కు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఇరుజట్ల మధ్య ఈ డే/నైట్ పోరు జరగనుంది. ఇందులో ఎవరు గెలుస్తారన్న ఆసక్తితో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2019 కోల్కతాలో బంగ్లాదేశ్తో జరిగిన పింక్ బాల్ టెస్ట్లోనే కోహ్లీ చివరిసారి సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ వందదాకా రాలేదు. దీంతో తన హోమ్గ్రౌండ్గా భావించే చిన్నస్వామి స్టేడియంలో విరాట్ ఏం చేస్తాడన్న ఉత్కంఠ మొదలైంది. మొహాలీలో మంచి ఆరంభం లభించినా.. భారీ ఇన్నింగ్స్గా మల్చలేకపోయాడు. ఈ మ్యాచ్లో అయినా విరాట్ సెంచరీతో ఫామ్లోకి వస్తాడని అందరూ భావిస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి. ఇక, చిన్నస్వామి పిచ్పై కొంచెం గ్రాస్ కనిపిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈ వికెట్పై టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ తీసుకునే చాన్సుంది. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగిసినా ఆశ్చర్యం లేదు.
కూర్పు ఎలా?
పింక్ బాల్ టెస్ట్కు ప్లాన్స్ చాలా భిన్నంగా ఉంటా యి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తుది జట్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం లైనప్లో స్పిన్నర్ జయంత్ ను తప్పించి అతని ప్లేస్లో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లేక మహ్మద్ సిరాజ్ను తీసుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నది. మొహాలీలో జయంత్ 17 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన లాస్ట్ పింక్ బాల్ టెస్ట్లో అక్షర్ 11 వికెట్లు పడగొట్టాడు. పిచ్ మీద గ్రాస్ ఉంటే సిరాజ్కు చాన్స్ ఎక్కువగా ఉంటుంది. బ్యాటింగ్ లైనప్లో మార్పులు ఉండకపోవచ్చు. విహారిని మరోసారి వన్ డౌన్లోనే పంపొచ్చు.
లంకకు గాయాల బెడద..
లంక టీమ్ను గాయాలు వేధిస్తున్నాయి. గాయాలతో పేసర్ లాహిరు కుమార, దుష్మంత చమీరా ఇప్పటికే మ్యాచ్కు దూరమయ్యారు. చమిక కరుణరత్నె టీమ్లోకి వచ్చినా పెద్దగా లాభం కనిపించడం లేదు. ఓపెనర్ పాథుమ్ నిసాంకా ప్లేస్లో దినేశ్ చండిమల్ తుది జట్టులోకి రావొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్ కరుణరత్నెపైనే బ్యాటింగ్ భారం పడనుంది. సీనియర్ మాథ్యూస్ వైఫల్యం టీమ్ను వెంటాడుతున్నది. కెరీర్లో లాస్ట్ సిరీస్ ఆడుతున్న పేసర్ సురంగ లక్మల్ మాత్రమే స్థాయికి తగిన పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో లంక.. రోహిత్సేనకు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
రోహిత్@ 400
ఇంటర్నేషనల్ కెరీర్లో రోహిత్కు ఇది 400వ మ్యాచ్. ఇప్పటివరకు అతను 44 టెస్ట్లు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు.
ఇండియాలో చివరి టెస్ట్
ఈ ఏడాది సొంతగడ్డపై ఇండియాకు ఇదే చివరి టెస్టు మ్యాచ్. డబ్ల్యూటీసీలో తర్వాత జరిగే ఏడు మ్యాచ్లూ విదేశాల్లోనే ఉంటాయి. లంకతో సిరీస్ ముగిసిన తర్వాత ఇండియా.. బంగ్లాదేశ్ (2), ఆస్ట్రేలియా (4), ఇంగ్లండ్ (1)తో టెస్ట్లు ఆడుతుంది.