
శంషాబాద్, వెలుగు: డీసీఎం బోల్తా పడి యువకుడు చనిపోయిన ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన ఎండీ మహ్మద్ ఆర్ఎంసీ ప్లాంట్లో డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు డీసీఎంలో నలుగురు కూలీలను తీసుకుని తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వస్తున్నాడు.
పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్పై అతడి డీసీఎంను మరో వెహికల్ ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎం బోల్తా పడింది. నలుగురు కూలీల్లో సూరజ్ కుమార్(20) అనే యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురు కూలీలు అరుణ్ కుమార్, విక్రమ్, జగదీశ్స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్బాడీని ఉస్మానియాకు తరలించారు. గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు