పాక్ రైలు ప్రమాదం: 65 కి చేరిన మృతుల సంఖ్య

పాక్ రైలు ప్రమాదం: 65 కి చేరిన మృతుల సంఖ్య

పాకిస్తాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 65 కి పెరిగింది. కరాచి-రావల్పిండి వెళుతున్న  తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో  గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో  మూడు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. లియాకత్‌పూర్‌ నగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 65 మంది మృతి చెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది మృతదేహాలను, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు.

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన వద్దనున్న గ్యాస్ సిలెండర్ ను వెలిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Death toll rises to 65, in Pakistan train accident