
- బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సమీక్ష
మెహిదీపట్నం, వెలుగు : బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండ కోటకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోట ఆవరణలో వివిధ విభాగాల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అవాంఛనీయ ఘటనలు, తోపులాటలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఫైరింజన్లు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, అడిషనల్ సీపీ విక్రమ్ మాన్ సింగ్, కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ సీపీ చంద్రమోహన్, ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.