సైనికుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన అమెరికా

సైనికుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన అమెరికా
  • ట్వీట్‌ చేసిన మైక్‌ పాంపియో
  • చైనా తన ఆదిపత్యాన్ని చూపేందుకు ప్రతయ్నిస్తోందన్న అమెరికా

వాషింగ్టన్‌: చైనా ఆర్మీతో పోరాడి వీరమరణం పొందిన మన సైనికులకు అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్ పాంపియో సంతాపం వ్యక్తం చేశారు. సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దెబ్బలు తగిలిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “ చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైన్యానికి మా సంతాపం తెలియజేస్తున్నాము. సైనికుల కుటుంబాలను మేం గుర్తుంచుకుంటాము” అని పాంపియో ట్వీట్‌ చేశారు. చైనా పాల్పడ్డ ఈ దుశ్చర్యను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. యావత్తు ప్రపంచం కరనాపై దృష్టి సారించి పోరాటం చేస్తుంటే బీజింగ్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ శాఖలో ఉన్నతాధికారి డేవిడ్‌ స్టిల్‌వెల్‌ ఆరోపించారు. చైనా చేస్తున్న పనులను ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. గతంలోనూ డోక్లామ్‌ ఇలాంటి సరిహద్దు వివాదాలు తలెత్తాయని స్టిల్‌వెల్‌ గుర్తు చేశారు. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్ఏ) ఈ సారి చాలా లోపలికి చొచ్చుకెళ్లిందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సైన్యాన్ని ఎక్కువగా మోహరించారని చెప్పారు. చైనా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అభిప్రాయపడ్డారు. కరోనా వివరాలను వెల్లడించడం లాంటి విషయాల్లో కూడా చైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇండియా – చైనా బార్డర్‌‌లోని గాల్వాన్‌లో జరిగిన గొడవలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మందిచనిపోయారని తెలుస్తున్నప్పటికీ వారి వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.