ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి.. వలసలతో కాంగ్రెస్​లో కలవరం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి.. వలసలతో కాంగ్రెస్​లో కలవరం
  • కాంగ్రెస్​లో కలవరం
  • గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి
  • ‘హైదరాబాద్​’లో నాలుగో ప్లేస్​.. ‘వరంగల్​’లో ఐదో ప్లేస్​
  • డీలా పడ్డ నేతలు, కన్ఫ్యూజన్​లో కేడర్​

హైదరాబాద్​, వెలుగు: హేమాహేమీలైన నేతలున్న కాంగ్రెస్​కు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్​నే ఇచ్చాయి. కనీసం ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో కూడా నిలువలేకపోయారు. హైదరాబాద్​– రంగారెడ్డి– మహబూబ్​నగర్​ స్థానంలో పోటీ చేసిన చిన్నారెడ్డి నాలుగో స్థానంలో, వరంగల్​– నల్గొండ–  ఖమ్మం స్థానంలో పోటీ చేసిన రాములు నాయక్​ ఐదో స్థానంలో నిలిచారు. ‘హైదరాబాద్’​ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా చిన్నారెడ్డికి 32,879 ఓట్లు వచ్చాయి. ‘వరంగల్’ స్థానంలో మొత్తం 3,87,969 ఓట్లు పోలవగా రాములు నాయక్​కు 27,588 ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితి చూసి కాంగ్రెస్​ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏ నాయకుడ్ని కదిలించినా పార్టీ భవిష్యత్​పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేడర్ అయోమయంలో కూరుకుపోయింది. 

ముందే అభ్యర్థులను ప్రకటించినా..
రెండు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని పార్టీల కన్నా ముందే కాంగ్రెస్​ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పోటీకి చాలా మంది నాయకులు ఆశపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్​ హైదరాబాద్​ వచ్చి రెండు స్థానాల ఆశావహుల పరిశీలన కోసం ప్రత్యేకంగా కమిటీలు వేశారు. చాలా మంది నేతలు తమకు అవకాశం కల్పించాలని అప్లయ్​ చేసుకున్నారు.  మీటింగ్​లలో తమకే ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పుకున్నారు. పేర్లన్నీ పరిశీలించిన కమిటీలు కాచి వడబోసి రెండు, మూడు పేర్లను హైకమాండ్​కు  పంపించాయి. చిన్నారెడ్డి, రాములు నాయక్​ను ఆయా స్థానాలకు అభ్యర్థులుగా హైకమాండ్​ ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్  ఎన్నికల తర్వాత పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావించిన పీసీసీ ఆశావహ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అగ్ర నేతలు ఎక్కడికక్కడ పోటీ పడి ప్రచారాలు చేశారు. ఉత్తమ్​, భట్టి, రేవంత్​, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిలాంటి నేతలు అభ్యర్థుల తరఫున తమ నియోజక వర్గాల్లో బాగానే ప్రచారం సాగించారు. కానీ ఫలితం రాబట్టలేకపోయారు. ‘హైదరాబాద్’ నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ అభ్యర్థి వాణీదేవి, బీజేపీ అభ్యర్థి రాంచందర్​రావు, ఇండిపెండెంట్​అభ్యర్థి నాగేశ్వర్  తర్వాతి స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థి పరిమితమయ్యారు. ‘వరంగల్’ స్థానంలో టీఆర్​ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి​, ఇండిపెండెంట్ అభ్యర్థి​ తీన్మార్​ మల్లన్న, టీజేఎస్​ అభ్యర్థి కోదండరాం, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్​రెడ్డి తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలిచారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొస్తుందనుకున్నా..
ఉద్యోగులు, నిరుద్యోగులు అధికార పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్​ భావించింది. ప్రచారంలో నేతలు ఇవే అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే తాను గెలిచిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చిన్నారెడ్డి శపథం చేశారు. కానీ ఆ వర్గాలు పట్టించుకోలేదని ఓటింగ్​ సరళిని పరిశీలిస్తే అర్థమైపోతుంది. 

వలసల బుగులు
గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోయామని కాంగ్రెస్​ నేతలు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో వారిని వలసల భయం వెంటాడుతోంది. ఎందరు పక్క పార్టీల బాట పడతారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్​ పరిధిలోని నేతలు కూన శ్రీశైలంగౌడ్, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్​కు గుడ్​ బై  చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్​ బీజేపీలో చేరారు. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీలతో టచ్​లో ఉన్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలో గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉంటుందేమోనని కాంగ్రెస్​ నేతల్లో బుగులు పట్టుకుంది.