టీమిండియా కెప్టెన్‌‌కు యోయో టెస్ట్ తప్పనిసరా?

టీమిండియా కెప్టెన్‌‌కు యోయో టెస్ట్ తప్పనిసరా?

న్యూఢిల్లీ: ప్రజలు మానసికంగా, శారీరకంగా ఎప్పుడూ ఫిట్‌‌గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ గతేడాది ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మూమెంట్ మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కొందరు ఫిట్‌‌నెస్ ప్రియులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతోనూ మోడీ మాట్లాడారు. వీరి సంభాషణలో టీమిండియా క్రికెటర్లు తమ ఫిట్‌‌నెస్‌‌ను నిరూపించుకునేందుకు కీలకంగా మారిన యో-యో టెస్టు టాపిక్ వచ్చింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌‌‌గా నీకు కూడా యో-యో టెస్ట్ తప్పనిసరా అని కోహ్లీని మోడీ ప్రశ్నించారు. మోడీతో కోహ్లీ సంభాషణ వివరాలు..

‘సార్ (మోడీ) యో-యో టెస్ట్ చాలా కీలకం. ఫిట్‌‌నెస్ కోణంలో నుంచి చూస్తే ఇది చాలా ముఖ్యం. మీరు గ్లోబల్ లెవల్‌‌‌లో చూసుకుంటే.. మన టీమ్ లెవల్ కొంచెం తక్కువగానే ఉంది. దీన్ని మేం పెంచాలనుకుంటున్నాం. ఇది ప్రాథమిక అవసరం. టీ20లు, వన్డేలు ఒక్క రోజులో ముగుస్తాయి. కానీ టెస్టు మ్యాచ్‌‌లో ఐదు రోజుల పాటు ఆడాల్సి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఫిట్‌‌నెస్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. మొదట నేనే ఇనీషియేటివ్ తీసుకొని యో-యో టెస్ట్‌‌కు వెళ్లా. ఈ టెస్టులో నేను ఫెయిలైనా సెలెక్షన్‌‌కు అందుబాటులో ఉండని విధంగా షరతులు ఉన్నాయి. ఇలాంటి విధానాలు అత్యవసరం. మాకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నాలో ఫిజికల్ ఫిట్‌‌నెస్, డైట్ చాలా మార్పులు తీసుకొచ్చాయి. నిజాయితీగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అలసిపోతున్నారు. కానీ మన జీవన విధానం బాగుండి, మంచి ఆహారం తీసుకుంటూ, ఫిట్‌‌నెస్ రొటీన్‌‌ను అలవర్చుకొని, మంచిగా నిద్రపోతే మాత్రం త్వరగా రికవర్ అవ్వొచ్చు. నేను ఎప్పుడైనా అలసిపోయినట్లు భావిస్తే త్వరగానే రికవర్ అవుతా. దీనికి నా ఫిట్‌‌నెస్ రొటీన్స్ కారణం’ అని ప్రధానితో కోహ్లీ చెప్పాడు.