
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలంటూ 23 మంది పార్టీ సీనియర్ లీడర్లు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని నేషనల్ మీడియా ఆదివారం బయట పెట్టింది. ఈ లేఖ రాసిన వారిలో మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చౌహాన్తోపాటు మాజీ కేంద్ర మంత్రులు కపిల్ సిబాల్, శశి థరూర్, యువ నేతలు మిలింద్ డియోరా, జతిన్ ప్రసాదలు ఉన్నారని తెలుస్తోంది.
సదరు లేఖ పంద్రాగస్టు రోజున సోనియాకు అందిందని సమాచారం. ‘ఫుల్ టైమ్ అండ్ ఎఫెక్టివ్ లీడర్షిప్’ పేరుతో సదరు లేఖ రాసినట్టు తెలిసింది. ‘నేను మీకు వివరాలు చెప్పలేను. కానీ ఆ లెటర్పై నేను సంతకాలు చేశానని మాత్రం చెప్పగలను. రేపు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత ఆ లెటర్లోని వివరాలు అందుబాటులో ఉంటాయి’ అని మాజీ రాజ్య సభ లీడర్ర పీజే కురియన్ స్పష్టం చేశారు.