ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుంది

ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుంది

జరగబోయే ఎన్నికలు GHMC ఎన్నికలని…రాష్ట్ర, కేంద్ర ఎన్నికలు కావన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. జగద్గిరిగుట్టలో ప్రచారం చేపట్టిన రేవంత్… రాజీవ్ స్వగృహ కింద 2వేల ఇళ్లు కాంగ్రెస్ హయాంలో కట్టించారన్నారు. కానీ  TRS వచ్చిన తర్వాత చేసిందేమీ లేదని… కబ్జాలకు మాత్రం పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్టలో ఏం చూసి TRS కు ఓటేయాలని ప్రశ్నించారు. కరోనా, వరదలు వచ్చినప్పుడు TRS,BJP వాళ్లు ఎటు వెళ్లారన్నారు. ఇప్పడు వచ్చి ఓట్లు అడుగుతారా అని అన్నారు. MIM,BJP వాళ్లు నాటకాలు ఆడుతున్నారన్నారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, పివి బ్రిడ్జి, మెట్రో రైలు, రాజీవ్ స్వగృహ ఇళ్లు, ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది కాంగ్రెస్ కాదా? ఆలోచన చేయండి అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని పొలిమేరల వరకు తరమాలన్నారు. పీవీ ఘాట్ కూలుస్తామని ఎవరైనా గడ్డపారలు తీసుకొస్తే అవే గడ్డపారలు గుంజుకుని వచ్చినోడి గుండెల్లో దింపుతామంటూ హెచ్చరించారు.

ప్రతిపక్షంలో ఎవరూ లేకపోతే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందని, రాచరికం వస్తుందని తెలిపారు ఎంపీ రేవంత్ రెడ్డి. పాలకుడు ఫాం హౌస్ లో పడుకోవడం తప్ప ఏం చేయడన్నారు. కేసీఆర్ ఎత్తిపోతల పథకం అంటే ఏందో అనుకున్నానన్న రేవంత్…పొద్దున లేస్తే కేసీఆర్ ఫాం హౌస్ లో ఎత్తుడు పోసుడు తప్ప ఏం చేస్తున్నారని అన్నారు. అంతేకాదు…ఎత్తుడు పోసుడు చేయలేక చేయి నొస్తుందని మంత్రి జగదీష్ రెడ్డిని పెట్టుకున్నారని తెలిపారు. ప్రజలు అన్నీ ఆలోచించి కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు రేవంత్.