
- గ్రూప్-2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి
- నిరుద్యోగుల కోరిక మేరకు టీజీపీఎస్సీ చెర్మన్ కు ఫోన్
- గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ చివరికి వాయిదా వేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుందని.. కానీ, తాము అలా ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులతో సెక్రటేరియెట్లో భట్టి, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ చర్చించారు.
నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ చివరి వారానికి వాయిదావేసే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ మహేందర్ రెడ్డికి భట్టి ఫోన్ చేసి సూచించారు. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని, ఓవర్ ల్యాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని నిరుద్యోగులకు ఆయన హామీ ఇచ్చారు.
కొందరు రాజకీయ నాయకులు చేసే ఉద్వేగపూరిత ప్రసంగాల్లో చిక్కుకోవద్దని ఆయన సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామని తెలిపారు. అధునాతన టెక్నాలజీతో ఆ సెంటర్లను నిర్మిస్తున్నామని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్ లైన్లో ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తామన్నారు.