బిజినెస్డెస్క్, వెలుగు: కరోనా సంక్షోభంతో ఎకానమీ స్లోడౌన్లో ఉన్నా మార్కెట్లో మిడ్క్యాప్ షేర్లు మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది పెద్ద కంపెనీల షేర్ల కంటే ఎక్కువగా ఈ షేర్లు లాభపడడం విశేషం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూస్తే అదానీ టోటల్ గ్యాస్(249 శాతం), అదానీ ఎంటర్ప్రైజెస్ (171 శాతం), అదానీ ట్రాన్స్మిషన్(169 శాతం), జేఎస్డబ్ల్యూ(95 శాతం), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (59 శాతం) వంటి షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. ఎన్ఎస్ఈలో నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ మార్కెట్ వాల్యూ ఈ ఏడాది 26 శాతం పెరిగి రూ. 25.62 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే టైమ్లో నిఫ్టీ 50 ఇండెక్స్ మార్కెట్ వాల్యూ 7 శాతం పెరిగి రూ. 116 లక్షల కోట్లను తాకింది. ఎన్ఎస్ఈలోని కంపెనీల మార్కెట్ క్యాప్లలో నిఫ్టీ 50 షేర్ల వాటా సుమారు 56 శాతంగా ఉంది. మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 2018 లో రికార్డ్ లెవెల్స్ను టచ్ చేసింది. ఆ టైమ్లో ఈ ఇండెక్స్ మార్కెట్ వాల్యూ రూ. 23 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది కాలం నుంచి మిడ్క్యాప్ షేర్లు లార్జ్క్యాప్ షేర్ల కంటే 32 శాతం ఎక్కువ ప్రాఫిట్స్ ఇవ్వడం గమనార్హం. ఎకానమీ పెర్ఫార్మెన్స్ కంటే ఇండివిడ్యువల్ షేర్లకు ఇన్వెస్టర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ ప్రైస్, నిఫ్టీ 50 ఇండెక్స్ ప్రైస్ కంటే 1.65 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది 2018 లో రెండు రెట్లుగా ఉందని, మిడ్క్యాప్ షేర్లు మరింత పెరుగుతాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. నిఫ్టీ మిడ్క్యాప్ 100 లో అదానీ టోటల్ గ్యాస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, చోళ ఇన్వెస్ట్మెంట్, వోల్టాస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లకు ఎక్కువ వెయిటేజి ఉంది.
రూ. లక్ష కోట్ల క్లబ్లోకి కొత్తగా 13 కంపెనీలు..
స్టాక్ మార్కెట్లు పెరుగుతుండడంతో కొత్తగా 13 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లను దాటాయి. ఇందులో ఎక్కువగా మిడ్క్యాప్ షేర్లు ఉండడం గమనార్హం. కొన్ని షేర్లు 150 శాతానికి పైగా లాభపడ్డాయి. కిందటేడాది ముగిసే నాటికి బీఎస్ఈలో మొత్తం 29 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లను దాటగా, ప్రస్తుతం ఈ నెంబర్ 42 కు పెరిగింది. ఈ 13 షేర్లలో అదానీ స్టాక్లు ముందున్నాయి. స్టీల్ కంపెనీల షేర్లు కూడా భారీగా పెరిగాయి.
- అదానీ టోటల్ గ్యాస్ షేరు కిందటేడాది డిసెంబర్ 31 నాటికి రూ. 374.90 గా ఉంది. ఈ షేరు సోమవారం రూ. 1,313 వద్ద క్లోజయ్యింది. ఇది 249 శాతం పెరుగుదల. కంపెనీ మార్కెట్ క్యాప్ 2021 లో రూ. 41,232 కోట్ల నుంచి రూ. 1,43, 987 కోట్లకు పెరిగింది.
- అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఈ ఏడాది ప్రారంభంలో రూ. 479 గా ఉండగా , 171 శాతం లాభపడి రూ. 1,298.45 కు చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 52,681 నుంచి రూ. 1,42,805 కోట్లను తాకింది.
- అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు ఈ ఏడాది 169 శాతం లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 48,139 కోట్ల నుంచి రూ. 1,29,387 కోట్లకు చేరుకుంది. ఇదే టైమ్లో జేఎస్డబ్ల్యూ షేర్లు 95 శాతం పెరగగా, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 93,619 కోట్ల నుంచి రూ. 1,83,008 కోట్లను తాకింది.
- టాటా స్టీల్ షేర్లు 2021 లో 84 శాతం ఎగిశాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 77,491 కోట్ల నుంచి రూ. 1,42,369 కోట్లకు చేరుకుంది. ఇదే టైమ్లో వేదంతా షేర్లు 75 శాతం లాభపడగా, టాటా మోటార్స్ షేర్లు 65 శాతం పెరిగాయి. ఈ రెండు కంపెనీల మార్కెట్ క్యాప్లు రూ. లక్ష కోట్లను క్రాస్ చేశాయి.
- ఈ ఏడాది అదానీ పోర్ట్స్ షేర్లు 59 శాతం లాభపడ్డాయి. కిందటేడాది డిసెంబర్ 31 నాటికి ఈ కంపెనీ షేరు రూ. 483.55 వద్ద ఉండగా, సోమవారం రూ. 764 వద్ద క్లోజయ్యింది. ఇదే టైమ్లో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 98,245 కోట్ల నుంచి రూ. 1,56,807 కోట్లకు చేరుకుంది. శ్రీ సిమెంట్ (16 %), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ( 13 % ), బజాజ్ ఆటో (12 %) , ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్( 11 శాతం), ఎన్టీపీసీ (6 %) షేర్లు భారీగా పెరగగా, వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లను క్రాస్ చేయడం విశేషం.
సెన్సెక్స్ 296 పాయింట్లు అప్..
ఫార్మా, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో వరసగా నాల్గో సెషన్లోనూ బెంచ్ మార్క్ ఇండెక్స్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ సోమవారం 296 పాయింట్లు పెరిగి 49,502 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 14,942 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ, డా.రెడ్డీస్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. వివిధ రాష్ట్రాలు కరోనా రిస్ట్రిక్షన్లను పెంచుతున్నప్పటికీ, ఈక్విటీ మార్కెట్లు వరసగా నాల్గో సెషన్లోనూ లాభాలను సాధించాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ వినోద్ మోడీ అన్నారు. ముఖ్యంగా మెటల్స్, ఫార్మా, ఆటో, పీఎస్యూ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్కు సపోర్ట్ లభించిందని చెప్పారు. కీలకమైన సెక్టార్లన్ని పాజిటివ్ ట్రేడయ్యాయని తెలిపారు. ‘కంపెనీల మార్చి క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటుండడం, ఆర్బీఐ లిక్విడిటీ సపోర్ట్, నేషనల్ లాక్డౌన్ లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు లాభపడుతున్నాయి’ అని పేర్కొన్నారు. షాంఘై, టోక్యో, సియోల్ మార్కెట్లు పాజిటివ్గా క్లోజవ్వగా, హాంకాంగ్ మార్కెట్ నెగిటివ్లో ముగిసింది. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. బ్రెంట్ క్రూడాయిల్0.53 శాతం పెరిగి బ్యారెల్ 68.64 డాలర్లను టచ్ చేసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు బలపడి 73.35 వద్ద సెటిలయ్యింది.