
కులగణన ప్రజా ఎజెండాగా మారింది. వెనుకబడిన కులాల్లో పెరిగిన చైతన్యమే ఇందుకు కారణం. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ కులగణన తోడ్పడుతుంది. బలహీన వర్గాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడానికి కులగణన ఒక కీలకమైన ముందడుగు అవుతుంది. జనాభా లెక్కల ఆధారంగా జనాభా నిష్పత్తిలో సమన్యాయం జరుగుతుందని కుల సంఘాలు భావిస్తున్నాయి. సంఖ్యా బలానికి తగ్గట్లుగా రాజకీయ, ప్రభుత్వ, విద్యారంగాలలో ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేస్తున్నాయి. మొదట్లో ఆయా అస్తిత్వ ఉద్యమాలు విలువలు, విషయపరంగానూ తమ రాజకీయాలపై నియంత్రణ కలిగి ఉండటం వల్ల అనేక విజయాలు సాధించాయి. కాలక్రమేణా బలహీనపడటంవల్ల ఉద్యమాలు నీరసించిపోయాయి.
భూ మితోపాటు కులం, మతం ఇక్కడి ప్రజలపై ఉన్న అనుబంధాన్ని 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటుతో బ్రిటీష్ పాలకులు గుర్తించారు. దీంతో, కుల కట్టుబాట్లు, మత ఆచార వ్యవహారాలు, కులానికి, మతానికి మధ్యవున్న విడదీయరాని సంబంధంపై బ్రిటీషువారు దృష్టి సారించారు. అప్పటి సోషియాలజిస్టులు, ఆంత్రోపాలజిస్టులతో అధ్యయనం జరిపించారు. ఎత్నాగ్రాఫిక్ అధ్యయనాలు కూడా చేయించారు. 1857 తర్వాత తమ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో జిల్లా మాన్యువల్స్, గజిటీర్స్ తయారుచేయించి, భూవ్యవస్థలతోపాటు సామాజిక వ్యవస్థల గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. జనాభా లెక్కలు, కులం, మతం, జెండర్, పిల్లలు, పెద్దలు వంటి పలు అంశాల సేకరణకు బీజం వేశారు.
కులంపై తొలిసారి అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు, బ్రిటీష్ అధికారులు విలయం హంటర్, హెర్బర్ట్రిస్లే, ఎడ్గార్ థర్ట్సన్, జె.హెచ్. హట్టన్ల ఆధ్వర్యంలో మనదేశంలో 1871 నుంచి 1931 వరకు అరవై సంవత్సరాలపాటు పది సంవత్సరాలకొకసారి ఆరుసార్లు కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు సేకరించారు. దీంతో కుల ప్రాధాన్యత పెరిగి ఆయా కులాలు తమ ‘కులహోదా' పెంచాలని ఒత్తిళ్లు, తమ కులమే గొప్పదని వాదనలు, వీటికితోడు అగ్రకులాల ఆధిపత్య పోరుతో 1941 నుంచి జనాభా లెక్కల సేకరణలో కులాన్ని చేర్చకుండా నిలిపివేశారు.
రాజకీయాల్లో కుల ప్రభావం
దేశ రాజకీయాల్లో కులం అత్యంత ప్రభావశీల అంశంగా ముందుకు వచ్చింది. పేదరికం, వెలి, అణిచివేత, సామాజికహోదా, ఆధిపత్యం, గౌరవ మర్యాదలకు మారుపేరుగా కులం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. దేశ సామాజిక వ్యవస్థపై అగ్రకులాల పట్టును కుల జనాభా లెక్కల ద్వారా వెలుగులోకి తెచ్చింది. 1909లో మింటోమార్లే సంస్కరణల ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, ఆ తర్వాత 1935లో షెడ్యూల్డు కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలను డా. అంబేద్కర్ ప్రతిపాదించారు. సుమారు అరవై ఏళ్ల తర్వాత తిరిగి 1990లో మండల్ కమిషన్ నివేదిక అమలుకావడంతో ఓబీసీ చైతన్యాన్ని దేశవ్యాప్తం చేసింది.
దీంతో 1991 నుంచి కులాన్ని జనాభా లెక్కల్లో చేర్చాలని డిమాండ్ మొదలై 2001 నాటికి గరిష్టస్థాయికి చేరుకుంది. ప్రజా డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి జనాభా లెక్కల్లో కులాలవారీ లెక్కలు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీ వేసింది. కానీ, ఇంతవరకు కులాల లెక్కలను ప్రకటించలేదు.
పార్లమెంట్ నుంచి గ్రామస్థాయి వరకు రిజర్వేషన్లు
సామాజిక స్థాయిని, సంపదను, అధికారాన్ని కులం నిర్ణయిస్తుందని జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ సూచించారు. ఈ విషయాన్ని జనాభా లెక్కలు స్పష్టం చేయడానికి ఆస్కారముంది. ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతులపైనే కాకుండా వార్డు, గ్రామ, పట్టణ ప్రాంతాల ప్రజల లెక్కలు అందించే ప్రాథమిక సమాచారానికి ఆధారంగా నిలుస్తుంది. పార్లమెంట్ నుంచి గ్రామస్థాయి వరకు రిజర్వేషన్లను ఏర్పాటు చేయడానికి అవకాశ ముంటుంది.
ఆదాయం, జీవన ప్రమాణం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు తదితరమైన అంశాలకు చెందిన సమాచారం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక ప్రక్రియను ప్రతిబింబించేలా ప్రభుత్వ విధానాలను జోడించి కులాలను లెక్కించడం తప్పనిసరిగా మారింది. ఇందువల్ల వెనుకబడిన కులాల సమస్యలు, రిజర్వేషన్లు, కోటాలకు ఓ రూపాన్ని ఇచ్చి సాంఘిక, సామాజిక, ఆర్థిక బలోపేతం చేయడం ఒక కోణమైతే, జీవితాన్ని క్రమబద్ధీకరించి అర్థవంతం చేసే సంక్లిష్ట నిర్మాణంగా చూడటం మరో కోణం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెనుకబడిన కులాల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం సంతోషకరమైన విషయం. సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పుడే కులాల సంఖ్య వెల్లడవుతుందని చాలామంది ఆశించారు. కానీ, అలా జరగలేదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో సమగ్ర అధ్యయనం చేయడానికి ముందుకువచ్చిన బీసీ కమిషన్ను కూడా
అభినందించాలి.
సామాజిక న్యాయం సాధించే దిశగా ...
కులపరమైన సమాచారం సేకరించేటప్పుడు చిన్నసంఖ్యలో ఉన్న సంచార జాతులను సరిగ్గా గుర్తించాలి. జనాభా లెక్కలు సేకరించేవారికి ఆయా కులాలలోని ఉప కులాల పేర్లు తెలియకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని అధిగమించేలా సర్వేకు సమగ్ర రూపకల్పన జరగాలి. సమగ్రమైన, సరైన కులాల వివరాల సేకరణను జాగ్రత్తగా, శ్రద్ధగా రూపొందించిన ఎత్నోగ్రాఫిక్ (ఫీల్డ్ వర్క్)తో కూడిన అధ్యయనాల ద్వారానే సాధ్యపడుతుందన్న నిష్ణాతుల సూచనను పరిగణనలోకి తీసుకోవాలి.
మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన 'సమగ్ర కుటుంబ సర్వే' నివేదికను ప్రకటించకపోవడంతో కులాల వివరాలు వెల్లడి కాలేదు. భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 'కులగణన' చేపట్టి కొన్ని నెలల క్రితం కులాల సంఖ్యను వెల్లడించింది. అయితే, కులాల సంఖ్యపట్ల కొన్ని కులాలు పెదవి విరిచాయి. అసమగ్రంగా ఉన్నట్టు కులనేతలు విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కుల సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అడుగు ముందుకు వేసి 2027 ఫిబ్రవరిలో చేపట్టనున్న జనగణనలో భాగంగా కులగణన చేపట్టనున్నట్టు తెలిపారు. సామాజిక న్యాయాన్ని సాధించే దిశగా ఈ కులగణన సర్వే ఉండాలని బహుజనులు కోరుకుంటున్నారు.
- కోడం పవన్కుమార్,
సీనియర్ జర్నలిస్ట్