
భూ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. సాదా బైనామా నుంచి మొదలు వారసత్వం, టైటిల్ సూట్ ఇలా అనేక కేసులు కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో జిల్లా, హైకోర్టులో 11.82 లక్షల కేసులలో 5,45,245 కేసులు భూములకు సంబంధించినవే ఉన్నాయి. గత ప్రభుత్వం భూ సమస్య లేని తెలంగాణ నిర్మిస్తాం అని చెప్పి చేసిన ప్రయత్నాలు ఆచరణ రూపం దాల్చలేదు. 2018 లో LRUP ల్యాండ్ రికార్డు అప్డేట్ ప్రోగ్రాం ద్వారా రికార్డులు కంప్యూటరీకరణ చేసినా అనేక అవకతవకలు వెలుగు చూశాయి.
ఫలితంగా కొత్త సమస్యలు వచ్చి సివిల్ తగాదాలు పెరిగాయి. భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం మండల కేంద్రంలో ఎమ్మార్వో, డివిజనల్లో ఆర్డీఓ, జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్/ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ, నెలల వ్యవధిలోనే ట్రిబ్యునల్స్ రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారు. ఏ ఒక్క సమస్య కూడా రెవెన్యూ ట్రిబ్యునల్ సంపూర్ణంగా పరిష్కారం చేసింది లేదు. ట్రిబ్యునల్స్లో విచారణ జరిగిన భూతగాదాలలో 90 శాతం సమస్యలు కోర్టు మెట్లు ఎక్కాయి.
సాదాబైనామా
ఒకవైపు 1971 ఆర్ ఓఆర్ చట్టంలో అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ (సాదాబైనామా)లను రెగ్యులర్ చేసే సెక్షన్ 5 A & 5 B లను, కొత్త రెవెన్యూ చట్టం 2020లో తొలగించి, ఇంకోవైపు సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తామని రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది లక్షల సాదాబైనామా అప్లికేషన్లు అపరిష్కారంగా ఉన్నాయి. చట్టంలో వెసులుబాటు చేయకుండా సాదాబైనామాలను ఎలా రెగ్యులర్ చేస్తారని కొందరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది.
రెవెన్యూ సదస్సులు
గత ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ చట్టం, పోర్టల్ను బంగాళాఖాతంలో వేసి కొత్త రెవెన్యూ చట్టం ‘భూభారతి’గా నామకరణం చేశారు. రెవెన్యూ చట్టం 2020, ధరణి పోర్టల్ లోపాల కారణంగానే ఈ ప్రభుత్వానికి కొత్త చట్టం పోర్టల్ తెచ్చే అవకాశం వచ్చిందని
చెప్పుకోవాలి. పాత చట్టంలోని అనేక సమస్యలను సరిదిద్దడానికి కొత్త చట్టం పోర్టల్ ద్వారా అధికారులకు అవకాశం కల్పిస్తూ సవరణలు చేయడం జరిగింది. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. భూమికి సంబంధించిన అన్ని సమస్యలకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
కానీ, సివిల్ తగాదాలు ఉన్న భూ సమస్యల అప్లికేషన్ మాత్రం రెవెన్యూ సదస్సులలో అధికారులు స్వీకరించడం లేదు. కోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ కాపీలు ఉంటేనే స్వీకరిస్తాం అంటున్నారు. గ్రామాలలో రెవెన్యూ చట్టాలపై అవగాహన లేక అగ్నికి ఆజ్యం పోసేవిధంగా పెద్దమనుషులు భూ సమస్యలను పెంచి పోషిస్తారు. ఇలా అన్నివిధాలుగా మానసికంగా, ఆర్థికంగా విసుగు చెంది రైతు ఆఖరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు. న్యాయస్థానాలపై ఉన్న అధికభారం వలన లక్షల కేసులు కోర్టులలో మగ్గుతున్నాయి.
రెవెన్యూ ట్రిబ్యునల్స్తో పరిష్కారం
ప్రస్తుత ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాం అని చట్టంలో పేర్కొన్నది. గత ప్రభుత్వంలాగ ప్రభుత్వ అధికారులు (ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్)లను ట్రిబ్యునల్స్ లలో భాగస్వామ్యం చేయకుండా రిటైర్డ్ జడ్జీలతో ఉమ్మడి పది లేదా 33 జిల్లాల్లో శాశ్వత రెవెన్యూ ట్రిబ్యునళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేసి, కోర్టులలో ఉన్న అన్ని సివిల్ తగాదాలను ట్రిబ్యునల్ లోకి బదిలీ చేయాలి.
కేసులను త్వరితగతిన పరిష్కారం చేస్తే ఒకవైపు రైతులకు న్యాయం జరుగుతుంది. ఇంకోవైపు కోర్టులపై కేసుల భారం తగ్గుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుందని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.
- బందెల సురేందర్ రెడ్డి,
మాజీ సైనికుడు