- రెండో టర్మ్ పాలనపై ప్రధాని మోడీ
- అభివృద్ధి, పెనుమార్పు సాధించామని వెల్లడి
న్యూఢిల్లీ: గడిచిన వంద రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధితోపాటు దేశంలో మంచి మార్పులెన్నో చోటుచేసుకున్నాయని, రైతు సంక్షేమం, నేషనల్ సెక్యూరిటీ తదితర అంశాల్లో ఎన్డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కేంద్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఆదివారం నాటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయనీ కామెంట్లు చేశారు. హర్యానాలోని రోహ్తక్లో ఆయన పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేపట్టిన ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ ముగింపు సభలో మోడీ మాట్లాడారు. ప్రజల్నే స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నామన్న ఆయన, 60 ఏండ్లలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో పార్లమెంట్ పనిచేసిందని, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి కీలక బిల్లులు పాసయ్యాయని,70 ఏండ్లుగా కొనసాగుతున్న సమస్యల్ని 100 రోజుల్లోపే పరిష్కరించామన్నారు. ‘‘జమ్మూకాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ రద్దు తర్వాత ప్రజలు కొత్త పరిష్కారాల్ని ఆలోచిస్తున్నారు. చంద్రయాన్–2 మిషన్ నిర్దేశిత టార్గెట్ను సాధించనప్పటికీ దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. ‘స్పోర్ట్స్మన్ స్పిరిట్’ అనే మాటలాగే దేశంలో ఇప్పుడు ‘ఇస్రో స్పిరిట్’ అందరిలో కనిపిస్తోంది’’ అని మోడీ అన్నారు. ఇంకొద్ది రోజుల్లో జరుగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇప్పటికే అందరికీ తెలుసంటూ బీజేపీ విక్టరీపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. హర్యానా ప్రజలు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారని, లోక్సభ ఎన్నికల్లో 55 శాతం ఓట్లతో మొత్తం 10 స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థుల్నే గెలిపించారని గుర్తుచేశారు.
100రోజులపై రాహుల్ సెటైర్లు
‘వంద రోజులు పూర్తయినా ఎలాంటి అభివృద్ధి సాధించని మోడీ సర్కారుకు శుభాకాంక్షలు’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఈ వంద రోజులూ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ముంచడానికి, మీడియాను గుప్పిట్లో పెట్టుకోడానికే చూశారు తప్ప, దారి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నించలేదని రాహుల్ విమర్శించారు. మోడీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, దీంతో కంపెనీలు ప్రమాదంలో పడ్డాయని, వాణిజ్యం మందకొడిగా సాగుతోందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆర్థిక రంగంలో దేశం దారుణంగా దెబ్బతిందన్న నిజాన్ని దాచిపెట్టడానికి కేంద్రం డ్రామాలాడుతూ, అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. మోడీ వంద రోజుల పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే అహంకారం, అనిశ్చితి, ప్రతీకార రాజకీయాలు అనే పదాలు సరిగ్గా సరిపోతాయని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ అన్నారు.
100 రోజుల బుక్లెట్ ఆవిష్కరణ
మోడీ సారధ్యంలోని కేంద్ర సర్కార్ వంద రోజుల్లోనే ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందని, దేశంలో మార్పుకు మారుపేరుగా నిలిచిందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించామని, ఇచ్చిన ప్రతిహామీని అమలుచేస్తామని తెలిపారు. రెండోటర్మ్ 100రోజులు పూర్తయిన సందర్భంగా ప్రధానికి, సహచర మంత్రులకు షా శుభాకాంక్షలు తెలిపారు. వంద రోజుల పాలనలో ఆర్టికల్ 370, 35ఏ రద్దు నిర్ణయాలే అత్యంత కీలకమైనవని సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. వంద రోజుల పాలనపై ప్రత్యేకంగా రూపొందించిన బుక్లెట్ను ఆయన ఆవిష్కరించారు.