జాన్ పహాడ్ సైదన్నా... సౌలత్ లేవన్నా.. దర్గా వద్ద కనిపించని కనీస వసతులు

జాన్ పహాడ్ సైదన్నా... సౌలత్ లేవన్నా.. దర్గా వద్ద కనిపించని కనీస వసతులు
  •     ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న జాన్ పహాడ్ ఉర్సు
  •     దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం


నేరేడుచర్ల(పాలకవీడు), సూర్యాపేట, వెలుగు : రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన సూర్యా పేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా వద్ద సౌలత్ లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 25 నుంచి జాన్ పహాడ్ ఉర్సు ప్రారంభం కానుంది. ఉత్సవాల్లో భాగంగా 26న నిర్వహించే గంధం ఊరేగింపునకు ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 2 లక్షల మంది హాజరయ్యే చాన్స్ ఉంది.

అయినా అక్కడ సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దర్గాకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఇన్ కం వస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో ఇటు ప్రభుత్వం, అటు వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు విఫలం అవుతున్నా రు. దీంతో ఉర్సు టైంలో వచ్చే లక్షలాది మంది భక్తులు రోడ్ల వెంట ఉంటూ, చెట్ల కింద వంటలు చేసుకుంటున్నారు. ప్రతి ఏటా ఉర్సు టైంలో వసతులు కల్పిస్తామని హామీలు ఇస్తున్న ప్రజాప్ర తినిధులు, ఆ తర్వాత మర్చిపోతున్నారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అపరిశుభ్రంగా దర్గా పరిసరాలు

జాన్ పహాడ్ దర్గాను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా సఫాయి బావి వద్ద స్నానాలు చేయడం సంప్రదాయం.కానీ ఈ బావి పూర్తిగా మురికిగా మారడంతో స్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.ఇక్కడశాశ్వత మంచినీటి సదుపాయం లేకపోవడంతో కందూరు చేసే  భక్తులు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుక్కోవాల్సి వస్తుంది.  

అలాగే శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో దర్గా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.దీంతో ఉర్సుకు వచ్చిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు.ఇక్కడ షాపుల నిర్వహన ద్వారా  ఏటా దర్గాకు సుమారు రూ.1.20 కోట్ల ఇన్ కం వస్తుంది. అయినా ఇక్కడ శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు ప్రయత్నించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

దర్గా భూమి కబ్జా

దర్గా అభివృద్ధి, భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం గతంలో 14 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఐదు ఎకరాల్లోపు స్థలం మాత్రమే ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చేతిలో ఉంది. మిగతా భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి రూమ్ లు నిర్మించుకున్నారు. వాటిని భక్తులకే అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. కబ్జాలపై రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు గురైన స్థలాలను గతేడాది విజిలెన్స్ ఆఫీసర్లు పరిశీలించినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్ప టికైనా స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని దర్గా భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..

దర్గా వద్దకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తుల నుండి కాంట్రాక్టర్లు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.కందూరుకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.వక్ఫ్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా,  అందిన కాడికి దోచుకుంటున్నారనే ఫిర్యాదులు  వినిపిస్తున్నాయి.  ఉర్సు సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సమస్యలను దృష్టి లో ఉంచుకుని అధికారులు...కాంట్రాక్టర్లపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అదే విధంగా అక్కడ షాపులలో అమ్మే వస్తువుల రేట్లపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు.

ప్రపోజల్స్ పంపించాం

దర్గా వద్ద శాశ్వత సౌకర్యాల కోసం గతంలోనే ప్రపోజల్స్ పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉర్సు నిర్వహణకు రూ.20 లక్షలు అవసరం అవుతాయని ప్రపోజల్స్ పెట్టాం. భూముల సర్వే చేపట్టి ఆక్రమణకు గురైన వాటిని స్వాధీనం చేసుకుంటాం.
- షేక్ మహ్మద్, ఉమ్మడి నల్గొండ జిల్లా 
వక్ఫ్ బోర్డు ఇన్స్ పెక్టర్ 

 ఆశలన్నీ మంత్రి ఉత్తమ్ పైనే..!

జాన్​పహాడ్ దర్గా అభివృద్ధి పై ఇచ్చిన  హామీలన్నీ  నీటిపై రాతలుగానే మిగిలిపోతున్నాయి. గతంలో  మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా జాన్ పహాడ్ దర్గాను రంగారెడ్డి జిల్లా లోని జహంగీర్ పీర్ దర్గా మాదిరిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.అయినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం... స్థానిక ఎమ్మెల్యే గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కీలక  మంత్రిగా ఉండటంతో ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. జాన్​ పహాడ్​ దర్గాపై అభిమానం ఉన్న ఉత్తమ్​ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారని భక్తులు విశ్వాసంతో ఉన్నారు.