
వేములవాడలో మంత్రి ఐకే రెడ్డి, ఏడుపాయల్లో హరీశ్రావు పట్టువస్త్రాల సమర్పణ
వెలుగు నెట్వర్క్: హర హర మహాదేవ, శంభోశంకర అంటూ శివ నామస్మరణతో రాష్ట్రంలోని శివాలయాలు మార్మోగాయి. వేములవాడ రాజన్నను సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వామికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కీసర గుట్ట రామలింగేశ్వర స్వామిని సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి మల్లారెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ దర్శించుకున్నారు.
మెదక్జిల్లా ఏడుపాయల్లో వనదుర్గా భవాని మాత సర్వాలంకారభూషితురాలై భక్తులకు దర్శనమిచ్చింది. ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్, నర్సాపూర్ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్ రెడ్డి వనదుర్గామాతకు పట్టువస్ర్తాలు సమర్పించారు.
శ్రీశైలం మల్లన్న స్వామికి ప్రభోత్సవం
మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలోని మల్లన్న ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం మల్లన్న స్వామికి ప్రభోత్సవం ఘనంగా జరిగింది. రాత్రి పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. – కర్నూలు, వెలుగు
శ్రీకాళహస్తిలో నిత్యాభిషేక మూర్తి రూపంలో వాయులింగేశ్వరుడు
దక్షిణ కైలాసంగా పేరొందిన ఏపీలోని శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా వాయులింగేశ్వరుడు నిత్యాభిషేక మూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున రెండు గంటల నుంచే శివనామ స్మరణతో శ్రీకాళహస్తి మార్మోగింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మొదటిసారి రాజగోపురం దగ్గర నుంచి సామాన్య భక్తులకు ఉచిత దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల మహాలఘుదర్శనం కల్పించారు. –తిరుమల, వెలుగు