- అన్ని దానాల కన్నా అన్నదానమే మిన్న
- వండ నలయదు వేవురు వచ్చిరేని
- నన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి
- యతిథు లేతేర నడికిరేయైన బెట్టు
- వలయు భోజ్యంబులింట నవ్వారి గాగ
ప్రవరాఖ్యుని భార్య ఎంత వండినా అలసిపోదు. ఎంతమంది వచ్చినా అందరికీ అన్నం పెడుతుంది. ఆవిడ అన్నపూర్ణ. అతిథులు అర్థరాత్రి వచ్చినా విసుగు, విరామం లేకుండా వడ్డిస్తుంది. అంతటి గొప్ప ఇల్లాలు సోమిదేవమ్మ... అని మనుచరిత్రలో అల్లసాని పెద్దన సోమిదేవమ్మ గురించి ఘనంగా చెబుతాడు.అతిథి అనే పదానికి తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా.. ఏ సమయంలోనైనా వచ్చేవారని అర్థం.
పూర్వం.. రోజుకి కనీసం ఒక అతిథికైనా భోజనం పెట్టకుండా గృహస్థులు భోజనం చేసేవారు కాదు. ఆకలితో వచ్చిన అతిథికి కడుపునిండా భోజనం పెట్టి, సంతృప్తుల్ని చేసిన తరువాత గృహస్థులు భోజనం చేసేవారు. అన్నదానం అంతటి గొప్పది. ఆకలితో ఉన్న ఒక్కప్రాణికి ఒక్క పూట అన్నం పెట్టినా అది వంద యజ్ఞాలు చేసిన పుణ్యంతో సమానమని పెద్దలు చెబుతారు.
డొక్కా సీతమ్మగారి పేరు వినని వారుండరు. ఆమె అవిశ్రాంతంగా అన్నదానం చేసేవారట. అర్ధరాత్రి వచ్చినవారికి సైతం అన్నం వండి వడ్డించేవారట. అటుగా ప్రయాణించేవారికి ఆహారం గురించి ఎటువంటి భయమూ ఉండేది కాదట. ‘డొక్కా సీతమ్మగారుండగా మనకు ఆకలి భయం ఎందుకు’ అని భరోసాగా ఉండేవారట.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్య భాగంలో ఉన్న డెల్టా గన్నవరం లేదా లంకల గన్నవరం అనే చిన్న గ్రామంలో ఉండేవారు. ఆ ప్రాంత ప్రజలు తరచుగా వచ్చే వరదలు, అతివృష్టి, అనావృష్టిల కారణంగా ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ గ్రామాల నుంచి వచ్చిన పేదలకు... లేదనకుండా నిత్యాన్నదానం చేసి, విశ్వమానవతను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ.
భారతీయ సంప్రదాయంలో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపమ్’ అనటం తెలిసిందే. అన్నదానానికి మించిన దానం లేదని భావించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. ‘అతిథి దేవోభవ’ అన్న పదానికి ఉదాహరణగా నిలిచారు.
బ్రిటిష్ ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని గుర్తించి, కింగ్ ఎడ్వర్డ్–7 వార్షికోత్సవ వేడుకలకు మన దేశంలోని ఇతర అతిథులతో కలిసి సీతమ్మ గారిని ఆహ్వానించి, గౌరవంతో ఆమెను ఢిల్లీకి తీసుకు రావాలని మద్రాస్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కానీ సీతమ్మ ‘నేను ప్రచారం కోసం ఈ పని చేయట్లేదు’ అని సున్నితంగా తిరస్కరించారు.
ఆమె మాటలకు మంత్రముగ్ధులయ్యారు కింగ్ ఎడ్వర్డ్. అందువల్ల బదులుగా కింగ్ ఎడ్వర్డ్కు ఆమె ఫొటోను బహూకరించారు మద్రాసు ప్రధాన కార్యదర్శి. ఆ వేడుకలో ఆమె కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీ వేసి, అందులో ఆమె ఫొటోను ఉంచి గౌరవించుకున్నారు.
మనం దానధర్మాలు అని జంటపదంగా వాడటం తెలిసిందే. దానం చేయటం, ధర్మం ఆచరించడం అని ఒక అర్థమైతే... మరో అర్థం... ధర్మబద్ధంగా దానం చేయటమని భావన చేయాలి. దానాలలో పలు రకాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్రదానం, గో దానం, భూ దానం, గృహ దానం, కన్యాదానం.. ఇలా అనేక దానాల గురించి మనం తరచు వింటూ ఉంటాం. అన్ని దానాలలోకి అన్నదానం ఉత్తమమైనదని మన పూర్వీకుల నాటి నుంచి చెబుతూ వస్తున్నారు. యజ్ఞయాగాలు చేసిన సమయంలో విరివిగా అన్నదానం జరిగేది.
ఇంకా...మహారాజ పట్టాభిషేకం, రాజు గారికి పుత్రోదయం, రాజు గారి వివాహం.. ఇలా అనేక సందర్భాలలో అన్నదానం చేసేవారు. కామధేనువు సాయంతో వశిష్ట మహర్షి ఆశ్రమంలో నిరంతరం అన్నదానం జరుగుతుండేది. ఆ ధేనువు కోసం విశ్వామిత్రుడు వశిష్టుని మీద దాడి చేసినట్లు మనకు పురాణగాథలు చెబుతున్నాయి.
మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సందర్భంలో కొన్ని లక్షల మందికి అన్నదానం చేసినట్లు భారతం చెబుతోంది. అలాగే అరణ్య వాసం సమయంలో పాండవులు తమ దగ్గర ఉన్న అక్షయపాత్ర సహకారంతో అతిథులకు అన్నదానం చేసేవారని కూడా మహాభారతం చెబుతోంది.
అన్నదానం కోసమే అశోక చక్రవర్తి సత్రాలు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. నేటికీ తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలలో నిరంతరాయంగా అన్నదానం జరుగుతోంది. అంతటి గొప్పది అన్నదానం. వీలైనంతవరకు అన్నదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పెద్దలు చెబుతున్నారు.
- డా. పురాణపండ వైజయంతి-
