
రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పైలెట్లపై డీజీసీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలను అతిక్రమించిన ఇద్దరు పైలెట్ల లెసెన్సులను డీజీసీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. అందులో భాగంగా స్పైస్జెట్కు చెందిన ఓ కమాండ్ పైలెట్పై ఆరు నెలల నిషేధం విధించింది. మేఘాల్లోకి వెళ్లొద్దని కో పైలెట్ వార్నింగ్ ఇచ్చినా కమాండ్ పైలెట్ పట్టించుకోలేదనే ఆరోపణల నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మే 1 న ముంబై నుంచి దుర్గాపూర్ వెళ్తున్న విమానం తీవ్ర కుదుపునకు గురైంది. కమాండ్ పైలెట్ సరైన రీతిలో ఆ విమానాన్ని నడపలేకపోయారు. ఆ సమయంలో విమానంలో సుమారు 195 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
ఇక మరో కేసులో ఓ చార్టర్ విమానానికి చెందిన పైలెట్ లైసెన్సును డీజీసీఏ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు లైసెన్సును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. 2021 అక్టోబర్ 19న బొకారో నుంచి రాంచీ వెళ్తున్న విమానంలో ఇంధనం లేదని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కానీ ఆ విమానంలో కావాల్సినంత ఇంధనం ఉందని విచారణలో తేలడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.