
- సైబర్ క్రైమ్ యూనిట్స్, కో ఆర్డినేషన్ సెల్లు ఏర్పాటు
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో వర్క్షాప్లో డీజీపీ అంజనీకుమార్
హైదరాబాద్,వెలుగు : టెక్నాలజీతో రెగ్యులర్ క్రైమ్ తగ్గినప్పటికీ సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయని డీజీపీ అంజనీకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో, ఇంటర్నెట్ సంబంధిత ప్రాబ్లమ్స్ , వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ) సవాల్గా మారాయని పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. ప్రస్తుత కాలంలో సైబర్ సెక్యూరిటీ మస్ట్ అని పేర్కొన్నారు. టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వర్క్షాప్లో డీజీపీ పాల్గొన్నారు. బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి టీఎస్సీఎస్బీ పనితీరును పరిశీలించారు. వర్క్షాప్లో జిల్లాల ఎస్పీలు, సీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలను అదుపు చేయడంలో బ్యూరో కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. హైదరాబాద్ కేంద్రంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పని చేస్తుందన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, ఖమ్మంలో సైబర్ క్రైమ్ యూనిట్స్, జిల్లాల్లో సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెల్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అప్ డేట్ కావాలి
కేసుల రిపోర్టింగ్, రిజిస్టర్, ఇన్వెస్టిగేషన్, పర్యవేక్షణ, రీఫండ్, ప్రాసిక్యూషన్ ప్రక్రియ టీఎస్సీఎస్బీ ఆధ్వర్యంలో జరుగుతున్నదని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. టీఎస్సీఎస్బీలో నియమితులైన ప్రతి అధికారి మస్ట్ గా ట్రైనింగ్ పొందాలని.. ఎప్పటికప్పుడు టెక్నికల్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టైన నిందితుల పూర్తి డాటాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పర్యవేక్షిస్తుందన్నారు. లెఫ్ట్వింగ్ తీవ్రవాదాన్ని అరికట్టేందుకు గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, సీఐసెల్ మంచి ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర సైబర్క్రైమ్ బ్యూరో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. వర్క్షాప్లో ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి, సైబర్క్రైమ్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు.