బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తాం : డీకే అరుణ

బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తాం : డీకే అరుణ

యాదాద్రి, వెలుగు: బంగారు తెలంగాణ పేరుతో మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్​పెద్ద దొంగ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఒక్క రాజగోపాల్​రెడ్డిని ఎదుర్కోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు రాబందుల్లా, గద్దల్లా మునుగోడు మీద పడ్డారని ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం చిన్నకొండూరు, మసీదు గూడెంలో కోమటిరెడ్డి లక్ష్మి, గూడూరు నారాయణరెడ్డితో కలిసి  ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్​తన కూతురు కవితను కాపాడుకోవడానికే ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఈడీ తమ మీద దాడులు చేయాలని కేటీఆర్​ కోరుకుంటున్నట్టుగా కనబడుతోందన్నారు. ధరణి పేరుతో లక్షల కోట్ల విలువైన భూములను కేసీఆర్​ కుటుంబం కబ్జా చేసిందని, బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిని తొలగిస్తామన్నారు.  గజ్వేల్​, సిద్దిపేటకు వందల కోట్లు ఇచ్చిన కేసీఆర్​..మునుగోడుకు రూ.రెండు కోట్లే ఇచ్చి వివక్ష చూపారని ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా నిధులివ్వకుండా ఇప్పుడు దత్తత తీసుకుంటాని  కేటీఆర్ ​అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్​ మీద విశ్వాసం లేకే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్​లోకి వెళ్లారన్నారు.  కాంగ్రెస్​కు పోరాటం చేసే శక్తి లేదని, పూర్తిగా బలహీన పడిందన్నారు.    

ఇండ్లు కట్టిస్తా.. రోడ్లు వేయిస్తా

సీఎం కేసీఆర్​ పక్షపాతం కారణంగా మునుగోడును రాజగోపాల్​రెడ్డి అభివృద్ధి చేయలేకపోయాడని కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. ఎన్నికలు అయిపోగానే ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కట్టిస్తామని, రోడ్లు వేయిస్తానని రాజగోపాల్​రెడ్డి తరపున హామీ ఇస్తున్నానన్నారు. టీఆర్ఎస్​ ఓడితే  పింఛన్లు ఆగిపోతాయని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.