న్యూఢిల్లీ: వ్యూహాలు పన్నడంలో, వాటిని అమలు చేయడంలో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత దిట్టో అందరికి తెలిసిందే. అలాగే స్పాట్ డెసిషన్స్ తీసుకోవడంలోనూ మహీని మించిన వారు లేరు. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఓ మాస్టర్ స్ట్రాటజీతో ఐపీఎల్–15 ప్రిపరేషన్స్ను మొదలుపెట్టబోతున్నాడు. లీగ్ మ్యాచ్లన్నీ మహారాష్ట్రలోనే నిర్వహిస్తామని బీసీసీఐ కన్ఫార్మ్ చేయడంతో.. ధోనీ సీఎస్కే ట్రెయినింగ్ క్యాంప్ను చెన్నై నుంచి సూరత్కు షిఫ్ట్ చేశాడు. దీని వెనుక ఉన్న స్ట్రాటజీని చూస్తే మహీ ఎంత షార్ప్గా ఆలోచిస్తాడో అర్థమవుతుంది. ఇటీవల సూరత్లో లాలాబాయ్ కాంట్రాక్టర్ స్టేడియాన్ని కొత్తగా నిర్మించారు. ఇందులోని పిచ్లను ముంబై మట్టితో తయారు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మహీ.. తమ 20 రోజుల ప్రి ట్రెయినింగ్ క్యాంప్ను సూరత్కు షిఫ్ట్ చేయాలని సీఎస్కేకు సూచించాడు. ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబోర్న్ వికెట్లపై ఆడటం ఈజీగా ఉంటుందని మహీ భావిస్తున్నాడు. మార్చి 2 నుంచి ఈ ట్రెయినింగ్ క్యాంప్ మొదలుకానుంది.