- ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డ బీసీ విద్యార్థి సంఘం నేతలు
ఓయూ, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టాలని గుర్తుకురాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అధికారం దూరం కాగానే పూలే దంపతులు గుర్తుకొచ్చారా అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ ప్రశ్నించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఏ ఒక్క రోజు కూడా ఫూలే విగ్రహంపై స్పందించని కవిత ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం కోసం ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. బీసీ సంఘాలుగా అనేకసార్లు కనీసం ట్యాంక్ బండ్ పైన ఫూలే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఇప్పటికైనా మహనీయులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని కవితకు ఆయన సూచించారు.