ఫిలిప్పీన్స్‌లో తెలుగు విద్యార్థుల ఇబ్బందులు

ఫిలిప్పీన్స్‌లో తెలుగు విద్యార్థుల ఇబ్బందులు

విదేశాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో విమానాశ్రయాల్లో చిక్కుకు పోయారు. కరోనా ఎఫెక్ట్‌తో విద్యాసంస్థలు మూసివేయడంతో దాదాపు 100 మంది విద్యార్థులు భారత్‌కు వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాలు రద్దు కావడంతో మూడు రోజులుగా మనీలా ఎయిర్‌ పోర్టులో పడిగాపులు గాస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి విద్యార్థులను అక్కడి సిబ్బంది బయటకు పంపేసింది. దీంతో ఎయిర్ పోర్టు  బయటనే నేలపై పడుకుంటూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో 30 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

ఎయిర్​పోర్టుల్లో చిక్కుకున్నోళ్లను తీసుకురండి: కేటీఆర్

మనీలా, కౌలాలంపూర్, రోమ్ విమానాశ్రయాల్లో చిక్కుకున్న ఇండియన్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, సివిల్ ఏవియేషన్ మంత్రి హర్​దీప్ సింగ్ లకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి బుధవారం వారిని ట్యాగ్​ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ దేశాల ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారి నుంచి తనకు బాధతో కూడిన సందేశాలు వస్తున్నాయన్నారు. కేంద్రం వెంటనే వారిని స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు.